నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే విద్యార్థుల రక్తం కళ్ళ చూస్తారా?: సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే

by Kodari Anjali |

కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

నీట్ పేపర్ లీకేజీపై ప్రశ్నిస్తే విద్యార్థుల రక్తం కళ్ళ చూస్తారా?: సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే
X

దిశ, కరీంనగర్ కలెక్టరేట్: సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు బజారున పడ్డాయని, లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, బాధ్యులైన కేంద్ర విద్యా శాఖ శాఖ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ పిలుపుమేరకు దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ వేలాదిగా తరలివచ్చి తమ ఆవేదన వ్యక్తం చేయడానికి ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోడీ వారిపై పాశవికంగా దాడులు చేయడం, లాఠీ ఛార్జీ చేసి, భాస్ప వాయువు ప్రయోగించి, విద్యార్థులను రక్తాలు కారే విధంగా కొట్టడం దుర్మార్గమని, ఉద్యమాలను అణచాలని చూస్తే మరింత పెరుగుతాయి తప్ప తగ్గవని, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన మోడీ ప్రభుత్వం ప్రజలపై దాడులు చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని, కేంద్ర విద్యా శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నైతిక విలువల గురించి, రాముడు గురించి, రామరాజ్యం గురించి గొప్పలు గొప్పలు చెప్పే నరేంద్ర మోడీ వాటిని ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు.

గోదావరి జలాల వినియోగ అథారిటీ ఏర్పాటు...

తెలంగాణ అంటేనే దక్కన్ పీఠమని, ఎత్తుపై ఉందని, వంపులో గోదావరి ఉందని,కృష్ణా నది నీళ్ళకంటే గోదావరి నీళ్లే ఎక్కువగా ఉపయోగించుకోవాలని అన్నారు. మెట్ట ప్రాంతానికి సాగునీరు, తాగు నీరు కావాలని 1996 నుంచి సిపిఐ, రైతుసంఘం ఆధ్వర్యంలో ఆందోనలు చేసిందని, 2000 సంవత్సరంలో రైతు సంఘం నేత అమరజీవి కొల్లి నాగేశ్వర్ రావు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశాడని, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాల వినియోగ అథారిటీ ఏర్పాటు చేశాడని కానీ దానివల్ల ఏం పని జరగలేదని, 2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా గోదావరి జలాలను మెట్టప్రాంతలకు తరలించడానికి కొంత ప్రయత్నం చేశాడని, దాని మూలంగానే శ్రీరాం సాగర్ వరద కాలువ పనులు జరిగాయని, మిడ్ మానేర్, గౌరవేల్లి, గండిపల్లి ప్రాజెక్టుల పనులు జరిగాయంటె వైఎస్సార్ కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కరువు కొరల్లో నుండి కాపాడి వెంటనే ప్రజలకు తాగునీరు సాగు నీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వం చొరవ చూపాలని...

నీరు అనేది ప్రజల జీవితాలకి సంబందించిన విషయం కాబట్టి తక్షణమే రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వారి సహకారంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి తుమ్మిడి హాట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ దిగువ మానేరు జలాషయం నీరు కనిష్ఠ స్థాయికి పడిపోయి దౌర్బాగ్యం స్థితిలో డ్యామ్ ఉందన్నారు. వెంటనే ఎల్లంపల్లి మిడ్ మానేరు నుండి నీరు ఎల్ ఎం డి కి వచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్,గూడెం లక్ష్మీ, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కొట్టె అంజలి, నగర నాయకులు బాకం ఆంజనేయులు, కసిబోజుల సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Next Story