Guwahati Masters : అశ్విని-తనీషా జోడీ, సతీశ్ కుమార్‌‌లకు టైటిల్స్

by Harish |

గువహతి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళా డబుల్స్ షట్లర్లు అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో జోడీ మహిళల డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది.

Guwahati Masters : అశ్విని-తనీషా జోడీ, సతీశ్ కుమార్‌‌లకు టైటిల్స్
X

దిశ, స్పోర్ట్స్ : గువహతి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళా డబుల్స్ షట్లర్లు అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో జోడీ మహిళల డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అశ్విని-తనీషా జోడీ వరుసగా రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అశ్విని-తనీషా జోడీ 21-18, 21-12 తేడాతో లీ హువా జౌ-వాంగ్ జెంగ్ మెంగ్(చైనా) ద్వయంపై విజయం సాధించింది. దీంతో టోర్నీలో సింగిల్స్‌లోనైనా, డబుల్స్‌లోనైనా టైటిల్ నిలబెట్టుకున్న తొలి జంటగా రికార్డు నెలకొల్పింది. ఈ జంటకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం. మరోవైపు, యువ ఆటగాడు సతీశ్ కుమార్ కరుణాకరన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్‌లో సతీశ్ 21-17, 21-14 తేడాతో చైనాకే చెందిన జు జువాన్ చెన్‌‌ను ఓడించి కెరీర్‌లో రెండో సూపర్ 100 టైటిల్‌ను సాధించాడు. ఉమెన్స్ సింగిల్స్‌లో యువ క్రీడాకారిణి అన్మోల్ ఖర్బ్‌‌కు నిరాశ తప్పలేదు. టైటిల్ పోరులో ఆమె 21-14, 13-21, 19-21 తేడాతో కై యాన్ యాన్(చైనా) చేతిలో పోరాడి ఓడి రన్నరప్‌గా సరిపెట్టింది. తొలి గేమ్‌ నెగ్గి శుభారంభం చేసిన అన్మోల్ మిగతా రెండు గేముల్లో ప్రత్యర్థిని నిలువరించలేకపోయింది.

Next Story