ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన హైదరాబాదీ.. ఒక్క మ్యాచ్‌లో ఎన్ని సిక్సులంటే..

by Dishanational5 |
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన హైదరాబాదీ.. ఒక్క మ్యాచ్‌లో ఎన్ని సిక్సులంటే..
X

దిశ, స్పోర్ట్స్ : హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ ఖాతాలో మరో వరల్డ్ రికార్డు చేరింది. రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న ప్లేట్ గ్రూపు మ్యాచ్‌లో 147 బంతుల్లో ఫాస్టెస్ట్ ఫస్ట్ క్లాస్ ట్రిపుల్ సెంచరీ బాది వరల్డ్ రికార్డు సృష్టించిన అతను.. అదే మ్యాచ్‌లో మరో ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఆ మ్యాచ్‌లో అగర్వాల్ 181 బంతుల్లో 366 పరుగులు చేశాడు. అతను 34 ఫోర్లు, 26 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు న్యూజిలాండ్ క్రికెటర్ కొలిన్ మున్రో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ప్లేయర్‌గా ఉన్నాడు.అతను ఓ మ్యాచ్‌లో 23 సిక్స్‌లు కొట్టాడు. తాజాగా తన్మయ్ అగర్వాల్ 26 సిక్స్‌లతో ఆ రికార్డును తిరగరాశాడు.

ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. అరుణాచల్ ప్రదేశ్‌పై హైదరాబాద్ ఇన్నింగ్స్ 187 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టోర్నీలో హైదరాబాద్‌కు ఇది వరుసగా నాలుగో విజయం. అంతేకాకుండా, ప్రతి మ్యాచ్‌నూ రెండు రోజుల్లోనే ముగించడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ 172 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 529/1తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ మరో 86 పరుగులు జోడించి 615/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. ట్రిపుల్ సెంచరీ వీరుడు తన్మయ్ అగర్వాల్ ఓవర్‌నైట్ స్కోరుకు మరో 43 పరుగులు జత చేసి వికెట్ కోల్పోయాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన అరుణచాల్ ప్రదేశ్‌ మరోమారు హైదరాబాద్ బౌలర్ల ధాటికి తేలిపోయింది. 256 పరుగులు చేసి ఆలౌటైంది. దివ్యాన్ష్ యాదవ్(91), టెక్కీ డొరియా(58) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్, సాకేత్ మూడేసి వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. కార్తికేయ, రోహిత్ రాయుడు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ విజయంతో హైదరాబాద్ ప్లేట్ గ్రూపులో సెమీస్ బెర్త్ దక్కించుకున్నటే. చివరి గ్రూపు మ్యాచ్‌లో మిజోరంతో తలపడనుంది.


Next Story

Most Viewed