క్రికెట్‌కు రసూల్ గుడ్‌బై.. జమ్మూకశ్మీర్ నుంచి భారత్‌కు ఆడిన తొలి ప్లేయర్

by Phanindra |

జమ్మూకశ్మీర్ నుంచి భారత్‌కు ఆడిన తొలి ప్లేయర్ పర్వేజ్ రసూల్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన కెరీర్‌లో మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

క్రికెట్‌కు రసూల్ గుడ్‌బై.. జమ్మూకశ్మీర్ నుంచి భారత్‌కు ఆడిన తొలి ప్లేయర్
X

దిశ, స్పోర్ట్స్: జమ్మూకశ్మీర్ నుంచి టీమిండియాకు ఆడిన తొలి ప్లేయర్ పర్వేజ్ రసూల్.. క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2014లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన ఈ దేశవాళీ దిగ్గజం.. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపాడు రసూల్.

‘కలలు, కష్టం, సంతోషం, లెక్కలేనన్ని జ్ఞాపకాలతో కూడి అద్భుతమైన ప్రయాణం నాది. దీన్ని నేను ఎప్పటికీ పదిలంగా దాచుకుంటా. లోకల్ మైదానాల నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించే వరకూ.. క్రికెట్లో ఆ దేవుడు నేను కోరుకున్నదంతా జరిగేలా వరించాడు. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన కుటుంబం, కోచ్‌లు, టీంమేట్స్, ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. మైదానంలో గడిపిన ప్రతిక్షణం నాకు గౌరవంగానే భావిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.

దేశవాళీ కెరీర్లో 5648 పరుగులు, 352 వికెట్లతో బెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా నిలిచిన రసూల్‌కు అంతర్జాతీయంగా పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. జడేజా, అక్షర్ పటేల్ వంటి వాళ్లు జట్టులోకి దూసుకురావడం, రసూల్ అంత గొప్ప ఫామ్‌లో లేకపోవడంతో అతనికి చాన్స్‌లు దక్కలేదు.

Next Story