Hockey : ఎదురులేని భారత్.. హ్యాట్రిక్ కొట్టిన అమ్మాయిలు

by Harish |

న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ మహిళల నేషన్స్ కప్‌లో భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది.

Hockey : ఎదురులేని భారత్.. హ్యాట్రిక్ కొట్టిన అమ్మాయిలు
X

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌లో జరుగుతున్న ఎఫ్‌ఐహెచ్ మహిళల నేషన్స్ కప్‌లో భారత మహిళల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన తమ చివరి గ్రూపు మ్యాచ్‌లో ఉరుగ్వేపై 3-2 తేడాతో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య ఆసక్తికరంగా సాగింది. గేములో ఉరుగ్వేదే తొలి గోల్. ఆ జట్టు తరపున 13వ నిమిషంలో కియారా అపెన్నినో గోల్ చేసింది. ఆ తర్వాత భారత్ బలంగా పుంజుకుంది. 24వ నిమిషంలో దీపిక సెహ్రావత్ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేసింది. అనంతరం 43వ నిమిషంలో దీపిక సోరెంగ్ చేసిన గోల్‌తో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక, ఆట చివర్లో మ్యాచ్ రసవత్తరంగా మారింది. 55వ నిమిషంలో ఉరుగ్వే గోల్ చేసి స్కోరును 2-2తో సమం చేయడంతో అందరిలోని ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో దీపిక సెహ్రావత్ అద్భుతమైన గోల్ చేసింది. 56వ నిమిషంలో తన నుంచి రెండో గోల్ చేసి భారత్‌ను 3-2తో ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఇక మిగతా సమయంలో ఉరుగ్వే మరో గోల్ చేయకపోవడంతో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు.. అమెరికా, జపాన్‌లను మట్టికరిపించింది. దీంతో గ్రూపు దశను అజేయంగా ముగించిన భారత్ ఇప్పటికే సెమీస్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 20న చిలీతో సెమీస్‌లో భారత్ తలపడనుంది.


Next Story