కివీస్ చేతిలో ఓటమి బాధలో ఉన్న పాక్‌కు మరో బిగ్ షాక్

by Harish |

చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే.

కివీస్ చేతిలో ఓటమి బాధలో ఉన్న పాక్‌కు మరో బిగ్ షాక్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీని ఆతిథ్య పాకిస్తాన్‌ పేలవంగా మొదలుపెట్టింది. న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. ఓటమి బాధతో ఉన్న పాక్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ ఫకర్ జమాన్ గాయం కారణంగా మిగతా టోర్నీకి దూరమయ్యాడు. కివీస్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా అతను గాయపడ్డాడు. దీంతో అతను మైదానం వీడగా క్రమాన్ గులామ్ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు.

పాక్ ఇన్నింగ్స్‌లో ఫకర్ తిరిగి మైదానంలోకి వచ్చాడు. ఓపెనర్‌గా కాకుండా 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను క్రీజులో అసౌకర్యంగానే కనిపించాడు. 41 బంతులు ఎదుర్కొని 24 రన్స్ చేసి అవుటయ్యాడు. అతని గాయంపై పీసీబీ అప్‌డేట్ ఇచ్చింది. ఫకర్ కండరాలు బెణకడంతోనే ఇబ్బందిపడ్డాడని తెలిపింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఫకర్ మిగతా టోర్నీ మొత్తం నుంచి తప్పుకున్నాడని ఐసీసీ గురువారం ప్రకటించింది. ఫకర్ స్థానాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇమామ్ ఉల్ హక్‌ను భర్తీ చేసింది. అందుకు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది.

ఫకర్ ఇటీవల ట్రై సిరీస్‌లో రాణించాడు. వరుసగా 84, 41 రన్స్ చేశాడు. ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను కోల్పోవడం పాక్‌కు భారీ దెబ్బే. మరోవైపు, ఇమామ్ చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. 2023 అక్టోబర్‌‌లో అతను చివరి మ్యాచ్ ఆడాడు. కివీస్ చేతిలో భారీ ఓటమి నేపథ్యంలో పాక్ నాకౌట్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. సెమీస్‌కు చేరాలంటే భారత్, బంగ్లా మ్యాచ్‌ల్లో గెలుపొందాల్సిందే. ఆదివారం టీమిండియాతో తర్వాతి మ్యాచ్ ఆడనుంది.


Next Story