ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. మిగతా మ్యాచ్‌లకు ఆ స్టార్ స్పిన్నర్ దూరం

by Dishanational3 |
ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. మిగతా మ్యాచ్‌లకు ఆ స్టార్ స్పిన్నర్ దూరం
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌తో మూడో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ మిగతా మ్యాచ్‌‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదివారం ధ్రువీకరించింది. అబుదాబి నుంచే అతను స్వదేశానికి వస్తాడని తెలిపింది. ఇంగ్లాండ్, సోమర్‌సెట్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో జాక్ లీచ్ రిహాబిలిటేషన్‌లో ఉంటాడని పేర్కొంది. జాక్ లీచ్ స్థానాన్ని భర్తీ చేయడం లేదని ఈసీబీ వెల్లడించింది.

కాగా, హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో జాక్ లీచ్‌ ఎడమ మోకాలికి గాయమైంది. గాయం కారణంగా వైజాగ్‌లో జరిగిన రెండో టెస్టుకు అతను దూరమైన విషయం తెలిసిందే. రెండో టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు అబుదాబికి వెళ్లారు. అక్కడే మూడో టెస్టు కోసం సన్నద్ధమవుతున్నారు. రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్‌లతో ఇంగ్లాండ్ స్పిన్ దళంగా బలంగా ఉంది. అంతేకాకుండా, పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా జో రూట్ కూడా జట్టులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో జాక్ లీచ్‌ స్థానాన్ని భర్తీ చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు 1-1తో సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ నెల 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది.


Next Story