ఆఖరి బంతికి ఇంగ్లాండ్ విక్టరీ.. చివరి టీ20లో భారత్ ఓటమి

by Harish |

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌‌ను భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమితో ముగించింది.

ఆఖరి బంతికి ఇంగ్లాండ్ విక్టరీ.. చివరి టీ20లో భారత్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌‌ను భారత మహిళల క్రికెట్ జట్టు ఓటమితో ముగించింది. చివరిబంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టీ20లో ఇంగ్లాండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అయితే, ఇప్పటికే సిరీస్ విజయాన్ని ఖాయం చేసుకున్న భారత్‌కు ఈ ఓటమి ఎలాంటి ప్రభావం చూపించలేదు. 3-2తో సిరీస్‌ భారత్ సొంతమైంది. ఐదో టీ20లో గెలుపు కోసం భారత్, ఇంగ్లాండ్ నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. ముందుగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(75) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు పోరాడే స్కోరు అందించింది. స్మృతి మంధాన(8), రోడ్రిగ్స్(1), హర్మన్‌ప్రీత్ కౌర్(15) వంటి స్టార్లతోపాటు హర్లీన్ డియోల్(4), రిచా ఘోష్(24) నిరాశపరిచారు.

అయితే, 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడానికి భారత బౌలర్లు చివరి వరకు కష్టపడ్డారు. అయితే, ఆఖరి బంతికి ఇంగ్లాండ్ విజయం లాంఛనమైంది. ఛేదనలో డేనియల్ వ్యాట్ హోడ్జ్(56), సోఫియా డంక్లీ(46), కెప్టెన్ టమ్మీ బ్యూమౌంట్(30) సత్తాచాటారు. ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ విజయానికి 6 పరుగులు కావాల్సి ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. తెలుగమ్మాయి అరుంధతి మొదటి బంతికి బ్యూమౌంట్‌ను, మూడో బంతికి అమీ జోన్స్(10)లను అవుట్ చేసి టెన్షన్‌ను తారా స్థాయికి పెంచేసింది. అయితే, 4, 5 బంతుల్లో ఎక్లోస్టోన్(4 నాటౌట్), స్కోల్‌ఫీల్డ్(2 నాటౌట్) 4 రన్స్ సాధించగా.. చివరి బంతికి ఒక్క పరుగు కావాల్సి వచ్చింది. ఆఖరి బంతికి ఎక్లోస్టోన్ ఒక రన్ తీయడంతో ఇంగ్లాండ్ జట్టు విజయతీరాలకు చేరింది. దీంతో సిరీస్‌ను విజయంతో ముగించాలని చూసిన భారత్‌కు నిరాశతప్పలేదు. అయితే, ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవడం భారత్‌కు ఇదే తొలిసారి.

సత్తాచాటిన తెలుగమ్మాయి శ్రీచరణి

తెలుగమ్మాయి, స్పిన్నర్ శ్రీచరణి తొలి టీ20 సిరీస్‌లోనే సత్తాచాటింది. 10 వికెట్లు పడగొట్టింది. దీంతో అరంగేట్రం టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. అలాగే, ఓ మహిళల టీ20 సిరీస్‌లో రాధా యాదవ్‌తో కలిసి సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శనతో శ్రీచరణి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుంది.


Next Story