చెలరేగిన దీప్తి.. తొలి వన్డేలో భారత్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తు

by Harish |

భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌ను విజయంతో ఆరంభించింది.

చెలరేగిన దీప్తి.. తొలి వన్డేలో భారత్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఆ దిశగా వన్డే సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. సౌతాంప్టన్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 258 రన్స్ చేసింది. భారత పేసర్ క్రాంతి గౌడ్ దెబ్బకు ఇంగ్లాండ్ 20 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆమె బౌలింగ్‌లో బ్యూమౌంట్(5), అమీ జోన్స్(1) అవుటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్(41), ఎమ్మా లంబ్(39) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. మూడో వికెట్‌కు 71 రన్స్ జోడించారు. వారిద్దరిని స్నేహ్ రాణా వరుస ఓవర్లలో పెవిలియన్ పంపింది. దీంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. కానీ, సోఫియా డంక్లీ(83), డేవిడ్సన్ రిచర్డ్స్(53) సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 106 పరుగులు జత చేయడంతో భారత్ ముందు ఇంగ్లాండ్ 259 పరుగుల టఫ్ టార్గెట్ నిర్దేశించింది. అయితే, ఆ లక్ష్యాన్ని భారత్ మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీప్తి శర్మ(62 నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. రోడ్రిగ్స్(48), ప్రాతిక రావల్(36) సత్తాచాటారు. తొలి వన్డే విజయంతో భారత్ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. శనివారం రెండో వన్డే జరగనుంది.


Next Story