క్రికెట్‌కు కరుణరత్నే గుడ్ బై

by Ajay Maddhiboyina |

కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, సనత్ జయసూర్య వంటి దిగ్గజాలు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత శ్రీలంక జట్టుకు మూల స్తంభంలా కరుణరత్నే నిలబడి పోయాడు.

క్రికెట్‌కు కరుణరత్నే గుడ్ బై
X

- 100వ టెస్టు తర్వాత రిటైర్మెంట్

- ఆస్ట్రేలియాతో రెండో టెస్టే చివరిది

- శ్రీలంక క్రికెట్‌కు పెద్ద ఎదురుదెబ్బ

దిశ, స్పోర్ట్స్: శ్రీలంక స్టార్ బ్యాటర్ దిముత్ కరుణరత్న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఆస్ట్రేలియాతో గాలేలో జరుగనున్న రెండో టెస్టే తనకు ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్ అని కరుణరత్నె తెలిపాడు. కాగా, ఈ మ్యాచ్ కరుణరత్నేకు 100వ టెస్టు కావడం గమనార్హం. కరుణరత్న క్రికెట్ నుంచి తప్పుకోవడం శ్రీలంక జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని అభిమానులు భావిస్తున్నారు. అకస్మాతుగా రిటైర్మెంట్ ప్రకటించడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కుమార సంగక్కర, మహేళ జయవర్దనే, సనత్ జయసూర్య వంటి దిగ్గజాలు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత శ్రీలంక జట్టుకు మూల స్తంభంలా కరుణరత్నే నిలబడి పోయాడు. లంక బ్యాటింగ్‌కు కరుణరత్నే వెన్నెముకలా మారి ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. శ్రీలంక అగ్రశ్రేణి బ్యాటర్‌గా ఎన్నో మ్యాచ్‌లలో పరుగు వరద పారించి, ఓటమి కోరల్లోంచి జట్టును విజయం వైపు నడిపించాడు. దశాబ్దానికి పైగా శ్రీలంక టెస్టు జట్టు బ్యాటింగ్‌కు స్తంభంలా మారాడు. అయితే ఇటీవల కాలంలో అతడి బ్యాట్ నుంచి పరుగులు పెద్దగా రావడం లేదు. ఫామ్‌ కోల్పోయి దాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ఎంతో ప్రయత్నించినా.. మునుపటిలా ఆడలేక పోతున్నాడు. దీంతో కరుణరత్నే ఆటకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు 'న్యూస్‌వైర్' రిపోర్టు చేసింది. కాగా, కరుణరత్నే రిటైర్మెంట్‌తో శ్రీలంక క్రికెట్‌లో ఒక అధ్యాయం ముగిసినట్లు అవుతుంది. కరుణరత్న ఇప్పటి వరకు 99టెస్టుల్లో 7,172 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 50 వన్డేలు ఆడి 1,316 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా గాలేలో ఆసీస్‌తో జరిగే టెస్టు తనకు 100వ మ్యాచ్ కావడంతో ఆ మ్యాచ్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించాలని కరుణరత్నే నిర్ణయం తీసుకున్నాడు.

Next Story