అరుణ్ జైట్లీ స్టేడియాన్ని పేల్చేస్తాం.. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు మెయిల్

by Harish |
అరుణ్ జైట్లీ స్టేడియాన్ని పేల్చేస్తాం.. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు మెయిల్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు వచ్చింది. స్టేడియాన్ని బాంబులు పెట్టి పేల్చేస్తామని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు శుక్రవారం ఈ మెయిల్ వచ్చింది. ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించకముందే శుక్రవారం ఉదయం డీడీసీఏకు ఈ బెదిరింపు వచ్చింది. ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకుంటామని మెయిల్‌‌లో ఉంది. ఇండియాలో తమ నమ్మకమైన పాకిస్తాన్ స్లీపర్ సెల్స్‌ను యాక్టివ్ చేశామని, అరుణ్ జైట్లీ స్టేడియంలో బాంబ్ బ్లాస్ట్ చేస్తామని మెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని డీడీసీఏ సెక్రెటరీ అశోక్ శర్మ ధ్రువీకరించారు. బాంబు బెదిరింపు వచ్చిందని నిజమేనని, దీని గురించి పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు. భారత్, పాక్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పటికే ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించింది. స్టేడియానికి బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ బాంబ్ స్క్వాడ్ మైదానంలో తనిఖీలు చేశారు. అలాగే, స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా, ఈ నెల 11న అరుణ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ, గుజరాత్ మ్యాచ్ జరగాల్సి ఉండేది. తాజాగా బీసీసీఐ ఐపీఎల్‌ను వారంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed