హెచ్‌సీఏలో భారీ గోల్ మాల్

by Ajay Maddhiboyina |

10 నెలల క్రితం మాజీ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్, మాజీ వైస్ చైర్మన్ జాన్ మనోజ్, మాజీ సెక్రటరీ ఆర్. విజయానంద్, మాజీ ట్రెజరర్ సురేందర్ కుమార్ అగర్వాల్‌పై కేసు నమోదు చేశారు.

హెచ్‌సీఏలో భారీ గోల్ మాల్
X

- పరికరాల కొనుగోలో పేరుతో నిధుల దుర్వినియోగం

- మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ చేతివాటం

- క్విడ్ ప్రోకో కింద జేబులోకి రూ.90 లక్షలు

దిశ, స్పోర్ట్స్: తెలంగాణలోకి క్రికెట్ అపెక్స్ కౌన్సిల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులు పలు విషయాలు వెల్లడయ్యాయి. హెచ్‌సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ నిధుల గోల్‌మాల్‌లో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. గతేడాది ఆగస్టులోనే హెచ్‌సీఏలో అవకతవకలకు జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైంది. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్‌మెంట్ పేరుతో హెచ్‌సీఏ ఇచ్చిన సబ్ కాంట్రాక్టుల్లో పెద్ద మొత్తం చేతులు మారినట్లు తెలిసింది. రూ.150 విలువ చేసే బకెట్ చైర్‌ను ఒక్కొక్కటి రూ.2,586కు కొనుగోలు చేసినట్లు తేలింది. 1500 బకెట్ చైర్లను భారీ మొత్తానికి కొనుగోలు చేశారని.. అవి కూడా దాదాపు రెండు సంవత్సరాల లేటుగా డెలివరీ అయినట్లు ఫిర్యాదు అందింది. కేవలం రెండు రోజుల్లో టెండర్లను పిలిచి.. ఆ వెంటనే ఎక్సెలెంట్ ఎంటర్‌ప్రైజెస్‌కు సబ్ కాంట్రాక్టు కట్టబెట్టారు. మార్చి 2020 నుంచి ఫిబ్రవరి 2023 మధ్య జరిగిన కొనుగోళ్లపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పైగా ఎక్స్‌లెంట్ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ ఎలాంటి బకెట్ చైర్లను తయారు చేయదని, కనీసం డీలర్ కూడా కాదని.. అది కేవలం ఎలక్ట్రికల్ అప్లయెన్సెన్స్ సేల్స్, సర్వీస్ మాత్రమే చేస్తుందని తేలింది. ఈ స్కామ్‌పై మాజీ సెక్రటరీ శేష్ నారాయణ్ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు నియమించిన ఏక సభ్య కమిటీ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, హెచ్‌సీఏ సీఈవో ఈ అంశంపై క్రిమినల్ కేసు నమోదు చేయించారు.

10 నెలల క్రితం మాజీ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్, మాజీ వైస్ చైర్మన్ జాన్ మనోజ్, మాజీ సెక్రటరీ ఆర్. విజయానంద్, మాజీ ట్రెజరర్ సురేందర్ కుమార్ అగర్వాల్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో మనీలాండరింగ్ కూడా జరిగినట్లు తేలడంతో ఈడీ రంగంలోకి దిగింది. అప్పటి ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ ఈ స్కామ్‌లో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. పెద్ద మొత్తంలో స్పోర్ట్స్ పరికరాలు, బకెట్ చైర్లు, జిమ్ సామాగ్రిని ఎలాంటి అనుమతులు లేకుండా కొన్నట్లు గుర్తించారు. క్రికెట్ బాల్స్, జిమ్ ఎక్విప్‌మెంట్, బకెట్ చైర్ల పేరుతో కాంట్రాక్టులు అప్పగించినందుకు సరేందర్ అగర్వాల్‌కు రూ.90 లక్షలను కాంట్రాక్టు పొందిన సంస్థలు చెల్లించినట్లు తేలింది. ఈ రూ.90 లక్షలు సురేందర్ అగర్వాల్ భార్య, కొడుకు, కోడలు అకౌంట్లకు బదిలీ అయ్యాయి. సురేందర్ అగర్వాల్‌కు చెందిన కేబీ జ్యూవెలర్స్ ఖాతాకు కూడా నగదు బదిలీ జరిగినట్లు స్పష్టమైంది. దీంతో సురేందర్ అగర్వాల్‌కు చెందిన రూ.51.29 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

Next Story