ముగియని శ్రీలంక నిరీక్షణ.. న్యూజిల్యాండ్‌తో మ్యాచ్ వర్షార్పణం

by Phanindra |

మహిళల వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంక, న్యూజిల్యాండ్ మధ్య మ్యాచ్ వరుణార్పణమైంది. శ్రీలంకకు గెలుపు అందని ద్రాక్షగానే మిగిలింది.

ముగియని శ్రీలంక నిరీక్షణ.. న్యూజిల్యాండ్‌తో మ్యాచ్ వర్షార్పణం
X

దిశ, స్పోర్ట్స్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో విజయం శ్రీలంకకు అందని ద్రాక్షగానే మిగిలింది. పేలవ ఫామ్‌లో ఉన్న న్యూజిల్యాండ్‌పై పైచేయి సాధించాలనుకున్న ఆ టీం ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. దీంతో మంగళవారం నాడు న్యూజిల్యాండ్, శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక పోరాడే స్కోరు చేసింది. బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై లంక ఓపెనర్లు విష్మీ గుణరత్నే (42), కెప్టెన్ చమారీ ఆటపట్టు (53) ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత వచ్చిన హాసిని పెరీరా (44), హర్షిత సమరవిక్రమ (26) కూడా ఫర్వాలేదనిపించారు. అప్పటికే మబ్బులు పట్టడంతో లంక చేసిన స్కోరు ఏమాత్రం సరిపోయేలా కనిపించలేదు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కివీస్ అమ్మాయిల ముందు ఓ మోస్తరు స్కోరు ఉండటం కూడా కష్టమే అని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో లంక బ్యాటర్ నీలాక్షిత సిల్వ హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఏకంగా 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 బంతుల్లోనే 55 పరుగులతో అజేయంగా నిలిచింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 258/6 స్కోరు చేసింది. కివీస్ బౌలర్లలో సోఫీ డివైన్ మూడు, బ్రీ ఇలింగ్ రెండు వికెట్లతో రాణించారు. అయితే రెండో ఇన్నింగ్స్ మొదలవడానికి ముందు వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. కాసేపటికి తగ్గినట్లే కనిపించిన వాన మరోసారి విజృంభించడంతో మ్యాచ్‌ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు.

సంక్షిప్త స్కోరుబోర్డు:

శ్రీలంక 258/6 (50 ఓవర్లు)

చమారీ ఆటపట్టు (53), హాసిని పెరీరా (44), విష్మీ గుణరత్నే (42), నీలాక్షిత సిల్వ (55 నాటౌట్), ఎక్స్‌ట్రాలు: 21

బౌలింగ్: సోఫీ డివైన్ (3/54), బ్రీ ఇల్లింగ్ (2/39)

Next Story