Champions Trophy : రోహిత్, కోహ్లీలకు చాంపియన్స్ ట్రోఫీనే ఆఖరి ఐసీసీ టోర్నీనా?

by Harish |

కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్, విరాట్ కోహ్లీలకు వన్డేలకు ఘనంగా వీడ్కోలు పలకడానికి చాంపియన్స్ ట్రోఫీ అద్భుతమైన చాన్స్.

Champions Trophy : రోహిత్, కోహ్లీలకు చాంపియన్స్ ట్రోఫీనే ఆఖరి ఐసీసీ టోర్నీనా?
X

దిశ, స్పోర్ట్స్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దశాబ్దానికిపైగా భారత క్రికెట్‌‌కు మూల స్తంభాలు. అయితే, ఎంతటి దిగ్గజ ఆటగాడైనా ఏదో ఒక సమయంలో ఆటకు వీడ్కోలు పలికాల్సిందే. ప్రస్తుతం రోహిత్, కోహ్లీలదీ అదే పరిస్థితి. వీరిద్దరూ గతేడాది టీ20 కెరీర్‌ను ఘనంగా ముగించారు. టీ20 వరల్డ్ కప్ టైటిల్‌తో పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు వీళ్లిద్దరి వన్డే రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతుంది. వన్డేలకు ఘనంగా వీడ్కోలు పలకడానికి వారికి చాంపియన్స్ ట్రోఫీ అద్భుతమైన చాన్స్. కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్, కోహ్లీలు మరో ఐసీసీ టోర్నీ ఆడే ఆస్కారం లేదు.

గతేడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్, కోహ్లీ చాలా కాలంపాటు టీ20లు ఆడలేదు. యువకులకు అవకాశాలు ఇచ్చారు. కానీ, టీ20 వరల్డ్ కప్‌‌కు ముందు టీ20ల్లోకి పునరాగమనం చేశారు. టీ20 ప్రపంచకప్ గెలిచారు. టీ20లకు సంతృప్తికరంగా ముగింపు పలికారు. ఇప్పుడు రోహిత్ వయసు 37 ఏళ్లు. కోహ్లీ వయసు 36 ఏళ్లు. వీరు ఇంకా ఎన్నో ఏళ్లు జాతీయ జట్టుకు ఆడలేరనేది వాస్తవం. కొంతకాలంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీడ్కోలు చెబుతారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వయసు పరంగా, ఫామ్ పరంగా చూస్తే రోహిత్, విరాట్ మరో ఐసీసీ టోర్నీ ఆడే అవకాశం లేదు. ఈ ఏడాది జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు భారత్ అర్హత సాధించలేదు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచకప్ ఆడలేరు. 2027లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. అప్పటి వరకు రోహిత్, కోహ్లీ వన్డేలు ఆడటం డౌటే. ఏ రకంగా చూసినా వాళ్లిద్దరికీ చాంపియన్స్ ట్రోఫీనే ఆఖరి ఐసీసీ టోర్నీ.

అందరి దృష్టి వారిపైనే

చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారన్న వార్తల నేపథ్యంలో రోహిత్, కోహ్లీలపైనే అందరి దృష్టి నెలకొంది. చాంపియన్స్ ట్రోఫీలోనూ సత్తాచాటి వన్డేలకు కూడా ఘనంగా ముగింపు పలుకుతారని అభిమానులు ఆశిస్తున్నారు. 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇద్దరికీ మంచి రికార్డే ఉంది. కోహ్లీ సగటు 58గా ఉన్నది. రోహిత్ సగటు 49. చివరి పది వన్డే ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ రెండు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. రోహిత్ ఖాతాలో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో మూడు సందర్భాల్లో 50 మార్క్‌కు తృటిలో కోల్పోయాడు. ఇటీవల ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లోనూ ఆకట్టుకున్నారు. రెండో వన్డేలో హిట్‌మ్యాన్ శతకం బాదగా.. మూడో వన్డేల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేసి చాంపియన్స్ ట్రోఫీ ముందు ఫామ్ అందుకున్నారు. దుబాయ్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా ఉన్నది. చాంపియన్స్ ట్రోఫీలో వీరు రాణించి భారత్‌కు మరో ఐసీసీ టైటిల్ అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Next Story