రంజీ ట్రోఫీ ఆడని క్రికెటర్లపై బీసీసీఐ అసంతృప్తి.. ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న బోర్డు

by Harish |
రంజీ ట్రోఫీ ఆడని క్రికెటర్లపై బీసీసీఐ అసంతృప్తి.. ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న బోర్డు
X

దిశ, స్పోర్ట్స్ : జాతీయ జట్టుకు ఎంపిక కాని ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి కూడా రంజీ ట్రోఫీ ఆడకపోవడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని హెచ్చరించేందుకు బోర్డు సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిట్‌గా ఉంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని, గాయాల బారిన పడితే నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)కి వెళ్లాలని ఆటగాళ్లకు బోర్డు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుందని పేర్కొన్నాయి. ‘జాతీయ జట్టుకు ఆడని క్రికెటర్లు రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్టుకు ఆడాలి. ఎన్‌సీఏ‌లో కోలుకుంటున్న వారికి మినహాయింపు ఉంటుంది. త్వరలోనే బీసీసీఐ ఈ విషయాన్ని ఆటగాళ్లకు తెలియజేయనుంది. జనవరి నుంచే ఐపీఎల్ మోడ్‌లో ఉన్న ఆటగాళ్లపై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నది.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. జాతీయ జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ రంజీల్లోనూ ఆడటం లేదు. వీరిద్దరూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పాండ్యాతో కలిసి ఇషాన్ ప్రాక్టీస్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. సీనియర్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే జాతీయ జట్టులోకి వచ్చేందుకు రంజీ ట్రోఫీ ఆడుతుంటే.. పలువురు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ కోసం రంజీలకు దూరంగా ఉండటంపై బీసీసీఐ గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed