‘నోరు తెరిస్తే.. కెరీర్‌ నాశనం చేస్తా’.. బ్రిజ్‌భూషణ్ గురించి కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు

by Dishanational5 |
‘నోరు తెరిస్తే.. కెరీర్‌ నాశనం చేస్తా’.. బ్రిజ్‌భూషణ్ గురించి కోర్టుకు తెలిపిన ఢిల్లీ పోలీసులు
X

దిశ, స్పోర్ట్స్ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌ సింగ్‌పై రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టులో కేసు విచారణ సందర్భంగా శుక్రవారం ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిరసన తెలిపిన రెజ్లర్లను బ్రిజ్‌భూషణ్‌ బెదిరించాడని కోర్టుకు తెలిపారు. ‘రెజ్లింగ్‌లో కొనసాగాలంటే నిశ్శబ్ధంగా ఉండండి. నేను మీ కెరీర్‌ను నిర్మించగలను, అదే విధంగా నాశనం కూడా చేయగలను.’అంటూ బెదిరింపులకు పాల్పడాడ్డని తెలిపారు. మరో మహిళా రెజ్లర్ ఫిర్యాదు ప్రకారం.. ధోతీ కుర్తా డ్రెస్‌లో ఎలా ఉన్నానని బ్రిజ్‌భూషణ్ ఆమెను అడిగాడని, ఓ యువతిని అలా అడగొచ్చా? అంటూ పోలీసుల తరపు న్యాయవాది ప్రశ్నించారు. అంతేకాకుండా, రెజ్లర్ల మరో ఫిర్యాదును కోర్టుకు విన్నవించారు. బ్రిజ్‌భూషణ్‌తోపాటు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ మాజీ అసిస్టెంట్ సెక్రెటరీ వినోద్ తోమర్ కార్యాలయంలోకి కేవలం మహిళా రెజర్లను మాత్రమే అనుమతి ఇస్తారని, పురుష రెజ్లర్లు లోపలికి రాకుండా తోమర్ తలుపులు మూసివేస్తాడని, ఇదే వారి ఉద్దేశాన్ని తెలియజేస్తుందని కోర్టుకు తెలిపారు. కోర్టు మినహాయింపు అనుమతితో బ్రిజ్‌భూషణ్ విచారణకు హాజరు కాలేదు.

Next Story

Most Viewed