ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌కు బ్రెజిల్ జట్టు?

by Harish |

ఐదుసార్లు ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్ బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది.

ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌కు బ్రెజిల్ జట్టు?
X

దిశ, స్పోర్ట్స్ : ఐదుసార్లు ఫిఫా వరల్డ్ కప్ చాంపియన్ బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు భారత్‌లో పర్యటించే అవకాశం ఉంది. భారత ఫుట్‌బాల్ జట్టుతో ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు బ్రెజిలియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్(సీబీఎఫ్) ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే సీబీఎఫ్ భారత నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్టు, అవి తుది దశకు కూడా వచ్చినట్టు బ్రెజిల్ మీడియా తెలిపింది. ఒప్పందం కుదిరితే భారత్, బ్రెజిల్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ అక్టోబర్‌లో కోల్‌కతాలో జరిగే అవకాశం ఉంది. బ్రెజిల్ సెప్టెంబర్-అక్టోబర్‌లో మూడు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. అందులో ఆస్ట్రేలియాతో రెండు మ్యాచ్‌లు ఇప్పటికే ఖరారయ్యాయి. మూడో మ్యాచ్‌ భారత్‌లో జరిగే చాన్స్ ఉంది. ఫిఫా వరల్డ్ కప్-2026 సమయంలోనే సీబీఎఫ్ భారత నిర్వాహకులతో చర్చలు జరిపినట్టు సమాచారం. బంగ్లాదేశ్, సింగపూర్, ఖతార్ నిర్వాహకులు బ్రెజిల్ జట్టుకు ఆతిథ్యమివ్వడానికి ఆసక్తి ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, భారత్‌లో బ్రెజిల్ జట్టుకు ఉన్న ఆదరణ, ఫిఫా వరల్డ్ కప్‌లో ఆ టీమ్‌కు దక్కిన మద్దతును దృష్టిలో పెట్టుకుని సీబీఎఫ్ భారత్‌లో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు ఆసక్తి చూపుతోంది. సీబీఎఫ్, భారత నిర్వాహకుల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, అధికారిక ప్రకటననే తరువాయి అని బ్రెజిల్ మీడియా పేర్కొంది. 1977లో కోల్‌కతాలోని ఈడెన్స్ గార్డెన్స్‌లో బ్రెజిల్ దిగ్గజం పీలే సందడి చేశాడు. న్యూయార్క్ కాస్మోస్ తరఫున మోహన్ బగాన్‌‌తో ఆడాడు.

Next Story