టీ20 ప్రపంచకప్‌కు భారత్‌లో ఐదు వేదికలు షార్ట్ లిస్ట్?.. ఫైనల్ అక్కడే

by Harish |

ఇటీవలే ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన భారత్ మరో ఐసీసీ ఈవెంట్‌ నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

టీ20 ప్రపంచకప్‌కు భారత్‌లో ఐదు వేదికలు షార్ట్ లిస్ట్?.. ఫైనల్ అక్కడే
X

దిశ, స్పోర్ట్స్ : ఇటీవలే ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన భారత్ మరో ఐసీసీ ఈవెంట్‌ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగబోయే పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పొట్టి ప్రపంచకప్‌ కోసం వేదికలను ఐసీసీ తాజాగా షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. భారత్‌ నుంచి ఐదు వేదికలను ఎంపిక చేసినట్టు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నయ్, ముంబై, ఢిల్లీ ఆతిథ్య నగరాలుగా షార్ట్ లిస్ట్ చేసినట్టు పేర్కొన్నాయి. ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్నట్టు తెలుస్తోంది.

అయితే, శ్రీలంకలో 2-3 మూడు స్టేడియాలు ఆతిథ్యమిస్తాయని తెలిసింది. కానీ, వాటిపై క్లారిటీ లేదు. ఒక్క వేదికగా కొలంబో కన్ఫర్మ్ అని సమాచారం. శ్రీలంక సెమీస్‌కు అర్హత సాధిస్తే ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుందని బీసీసీఐకి ఐసీసీ తెలియజేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఫైనల్‌కు పాకిస్తాన్ క్వాలిఫై అయితే టైటిల్ పోరు కూడా కొలంబోలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. అహ్మదాబాద్‌తోపాటు ఫైనల్‌కు స్టాండ్ బై వేదికగా కొలంబోను ఖరారు చేయనున్నట్టు సమాచారం. అలాగే, భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కూడా కొలంబోలో జరగనుంది. అయితే, వేదికలపై ఐసీసీ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది. టీ20 వరల్డ్ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనుంది.


Next Story