ఐపీఎల్-2027‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ సెక్రెటరీ

by Harish |

వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్‌‌ను ముందుగానే నిర్వహించేలా చూస్తున్నామని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.

ఐపీఎల్-2027‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ సెక్రెటరీ
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్‌‌ను ముందుగానే నిర్వహించేలా చూస్తున్నామని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ఆ దిశగా బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచన చేస్తుందని తెలిపారు. ఆటగాళ్లు, ప్రేక్షకులు ఎదుర్కొనే తీవ్రమైన వేడి, అలాగే మే ద్వితీయార్థంలో మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించకుండా టోర్నీని ముందుకు జరిపేందుకు చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘ఈ ఏడాది మార్చి 28 నుంచి ఐపీఎల్ మొదలైంది. మే 31కు ముగిసింది. మే 15 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేము దాని గురించి ప్రధానంగా చర్చిస్తున్నాం. మరో విషయం తీవ్రమైన వేడి. వేడి వాతావరణం ప్లేయర్లకు, ప్రేక్షకులకు అనుకూలంగా లేదు.అభిమానులే కాకుండా ప్లేయర్ల నుంచి కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంత వేడిలో ఆడటానికి ప్లేయర్లు సిద్ధంగా లేరు. అందువల్ల మార్చి నెలాఖరు కంటే కొంచెం ముందుగానే టోర్నీని ప్రారంభించవచ్చా? అనే విషయం గురించి బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో చర్చ జరుగుతుంది.’అని సైకియా తెలిపారు.

అంతేకాకుండా వచ్చే ఏడాది మారి 10 నుంచి మే 15 వరకు టోర్నీని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. ‘మార్చి 10న టోర్నీని ప్రారంభించి మే 15న ముగించేలా విండో చూడాలని మా జనరల్ మేనేజర్‌కు నేను సూచించాను. తద్వారా ఐపీఎల్-2027 ప్లే ఆఫ్స్, ఫైనల్ ఎలాంటి ప్రతికూల వాతావరణం తలెత్తకుండా జరుగుతాయి.’అని సైకియా తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది లీగ్ దశ విస్తరణను సైకియా కొట్టిపారేశారు. అది తక్షణమే సాధ్యం కాదన్నారు. 74 మ్యాచ్‌ల నుంచి 94 గేములకు మార్చాలనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. మ్యాచ్‌ల సంఖ్య పెంపుపై టీమిండియానే కాకుండా ఐసీసీలోని ఇతర క్రికెట్ దేశాల ప్రయోజనాలను దృష్టి పెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ‘ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ దేశాల ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. మేము ద్వైపాక్షిక మ్యాచ్‌లు, బహుల దేశాల టోర్నమెంట్‌లకు ఆటంకం కలిగించాలనుకోవడం లేదు.’అని సైకియా తెలిపారు.


Next Story