వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సింధు శుభారంభం

by Harish |

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది.

వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సింధు శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్‌లో జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఆమె తొలి రౌండ్‌‌లో విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో సింధు 23-21, 21-6 తేడాతో బల్గేరియాకు చెందని కలోయానా నల్బోంతోవాను మట్టికరిపించింది. అయితే, ఆరంభంలో సింధు తడబడింది. ప్రత్యర్థి దూకుడుగా ఆడటంతో ఒత్తిడికి లోనైంది. ఒక దశలో 12-7తో వెనుకడి గేమును కోల్పోయేలా కనిపించింది. కానీ, ఆ తర్వాత సింధు అద్భుతంగా పుంజుకుంది. వరుసగా ఐదు పాయింట్స్ నెగ్గి 12-12తో సమం చేసిన ఆమె ఆపై దూకుడు ప్రదర్శించి తొలి గేము సొంతం చేసుకుంది. ఇక, రెండో గేములో సింధు జోరుకు ఎదురులేకుండా పోయింది. 39 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి రెండో రౌండ్‌కు చేరుకుంది. రెండో రౌండ్‌లో థాయిలాండ్ షట్లర్ కరుపతేవన్ లెట్షానాతో తలపడనుంది.

పురుషుల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ హెచ్.ఎస్ ప్రణయ్ కూడా శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ఫిన్లాండ్‌కు చెందిన జోకిమ్ ఓల్డోర్ఫ్‌పై 18-21, 15-21 తేడాతో విజయం సాధించాడు. తొలి రౌండ్‌ను దాటడానికి ప్రణయ్ శ్రమించాల్సి వచ్చింది. 47 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ఫిన్లాండ్ ఆటగాడి నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయినప్పటికీ ప్రణయ్ వెనుకడగు వేయలేదు. మరోవైపు, మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-రుత్విక శివాణి జంట రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో భారత జోడీ 18-21, 21-16, 21-18 తేడాతో మకావుకు చెందిన లియోంగ్ ఐయోక్ చోంగ్-వెంగ్ చి జంటపై గెలుపొందింది. అయితే, పురుషుల డబుల్స్‌లో నిరాశ తప్పలేదు. భారత జంట హరిహరన్-రుబాన్ కుమార్ 15-21, 5-21 తేడాతో లియు కువాంగ్ హెంగ్-యాంగ్ పొ హన్(చైనీస్ తైపీ) ద్వయం చేతిలో ఓడిపోయింది.


Next Story