టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తా : వార్నర్

by Dishanational3 |
టీ20 వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తా : వార్నర్
X

దిశ, స్పోర్ట్స్ : ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్‌ రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని వెల్లడించాడు. వెస్టిండీస్‌తో తొలి టీ20లో ఆసిస్ 11 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వార్నర్(70) మెరుపు హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం వార్నర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు పేర్కొన్నాడు. ‘జట్టు విజయంలో కీలకపాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది. బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలంగా ఉంది. ఉపయోగించుకుంటే భారీ స్కోరు చేయొచ్చు. కొత్త ఉత్సాహంతో ఉన్నాను. టీ20 ప్రపంచకప్‌తో ముగించాలనుకుంటున్నా. వచ్చే ఆరు నెలలు మాకు ఎంతో కీలకం.’ వార్నర్ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. గత నెలలలో వార్నర్ టెస్టు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత గడ్డపై వన్డే వరల్డ్ కప్‌‌లో టీమ్ ఇండియాతో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. అలాగే, సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో చివరి టెస్టు ఆడి సుదీర్ఘ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు.


Next Story