ఏసియన్ షూటింగ్‌లో ఎలవెనిల్‌కు స్వర్ణం.. టీమ్ ఈవెంట్‌లోనూ మెడల్

by Harish |

కజకస్థాన్‌లో జరుగుతున్న ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు.

ఏసియన్ షూటింగ్‌లో ఎలవెనిల్‌కు స్వర్ణం.. టీమ్ ఈవెంట్‌లోనూ మెడల్
X

దిశ, స్పోర్ట్స్ : కజకస్థాన్‌లో జరుగుతున్న ఏసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. శుక్రవారం మహిళా షూటర్ ఎలవెనిల్ వలరివన్ రెండు పతకాలతో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో ఆమె 253.6 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, ఈ ప్రదర్శనతో కొత్త ఏసియన్ రికార్డు కూడా నెలకొల్పింది. ఇక, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో మెహులి ఘోష్, అనన్య‌లతో కలిసి ఎలవెనిల్ కాంస్య పతకం సాధించింది. భారత త్రయం 1,891 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. చైనా(1902), సౌత్ కొరియా(1897.5) జట్లు స్వర్ణ, రజత పతకాలు గెలిచాయి.

మరోవైపు, స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అభయ్ సింగ్-గణేమత్ జోడీ కాంస్య పతకం సాధించింది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో అభయ్ జంట 39-37తేడాతో కువైట్‌‌కు చెందిన అబ్దుల్లా-అఫ్రాహ్ జోడీని ఓడించింది. అలాగే, జూనియర్ షూటర్లు కూడా తమ జోరును కొనసాగిస్తున్నారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ ఈవెంట్‌లో శాంభవి, హృద్య శ్రీ, ఇషా‌లతో కూడిన భారత జట్టు 1,896.2 స్కోరుతో బంగారు పతకం సాధించింది. అలాగే, కొత్త వరల్డ్ రికార్డును కూడా సృష్టించింది. స్కీట్ మిక్స్‌డ్ జూనియర్ ఈవెంట్‌‌‌లో హర్మెహర్ సింగ్-యశస్వి రాథోర్ జోడీ కూడా గోల్డ్ మెడల్ గెలిచింది. ఫైనల్‌లో భారత జంట 39-36 తేడాతో కజకస్థాన్ షూటర్లపై విజయం సాధించింది. టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 31కు చేరింది. మెడల్స్ టేబుల్‌లో భారతే అగ్రస్థానంలో కొనసాగుతోంది.


Next Story