టీమిండియాకు పాకిస్తాన్ పోటీనే కాదు.. రాములమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
టీమిండియాకు పాకిస్తాన్ పోటీనే కాదు.. రాములమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలపై తరచూ విమర్శలు గుప్పించే బీజేపీ నేత విజయశాంతి తాజాగా ఆదివారం జరిగిన ఆసియా కప్ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌పై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిందని మనోళ్లు నిరాశ పడటం, గెలిచినందుకు పాక్ సంబరాలు చేసుకోవడం పూర్తిగా అర్థరహితమని విజయశాంతి అన్నారు. భారత్‌తో ఎక్కువగా ఓడిపోతూ వస్తున్న పాక్‌లో వారి విజయాన్ని సంబరం చేసుకోవడం వాళ్ళకి బాగుంటుంది కానీ, మనం బాధపడటంలో ఏమాత్రం అర్థం లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత అభిమానులు ఈ ఓటమికి ఏమాత్రం విలువ ఇచ్చినా భారత్‌కి పాక్ సమఉజ్జీయే అని అంగీకరించినట్లే అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక లాంటి క్రికెట్ దిగ్గజాలు.. బంగ్లాదేశ్, హాలాండ్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే లాంటి పసికూనలు ఎన్నో టోర్నీలు ఆడుతుంటాయి. అలాంటిది, ఎన్నో దేశాలపై పదే పదే విజయాలు సాధించిన మన టీమిండియాకి ఈ ఓటమి ఒక లెక్క కానే కాదు అంటూ చెప్పుకొచ్చారు.

అప్పుడప్పుడూ ఎదురయ్యే ఓటముల్లో భాగంగా ఇది ఒకటి అంతే. కానీ, మన దేశంలో ఉగ్రవాదానికి ఊతమిస్తూ మనని నిరంతర శత్రువుగా చూస్తూ తన ఆర్థిక వ్యవస్థని నాశనం చేసుకుని దారుణంగా అప్పులపాలై చివరికి జూలోని జంతువుల్ని కూడా అమ్ముకుంటూ ఏ విషయంలోనూ మనకి సరితూగని పాకిస్తాన్ ఏదో ఒక మ్యాచ్‌లో టీమిండియాపై గెలిచినంత మాత్రాన అదేదో పెద్ద విషయం అన్నట్టు చూడటం మన స్థాయికి తగని వ్యవహారం. ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్‌లకి మీడియా కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. టెన్నీస్, జిమ్నాస్టిక్స్, సాకర్, హాకీ లాంటి ఎన్నో క్రీడల్లో ప్రపంచ దేశాలన్నీ పెద్దవైనా, చిన్నవైనా పాల్గొని పతకాలు సాధిస్తుంటాయి. ఈ ఒక్క క్రికెట్ కోసం ఇది మాత్రమే ఆట అన్నట్టు పాక్ మాత్రమే మనకి పోటీ అన్నట్టు వేరే దేశాలు, ఇంకే ఆటలు లేనట్టు భావించే ప్రయాసకు కోట్లాది భారతీయుల్ని గురి చెయ్యడం అసమంజసం. మన టీమిండియా రికార్డులకి రికార్డులే తిరగరాసింది.. రాస్తుంది అంటూ విజయశాంతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Also Read : పాకిస్తాన్ పై పోరాడి ఓడిన భారత్.. కోహ్లీ అర్ధ సెంచరీ వృథా..




Next Story