- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia Cup : ఫైనల్కు ముందు సన్నాహకంగా.. నేడు శ్రీలంకతో భారత్ ఢీ
ఆసియా కప్లో టీమిండియా ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్లో టీమిండియా ఇప్పటికే ఫైనల్కు చేరుకుంది. టోర్నీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో పాకిస్తాన్తో తలపడనుంది. అంతకుముందు సూర్య సేన నేడు చివరి సూపర్-4 మ్యాచ్లో శ్రీలంకతో ఆడనుంది. ఫైనల్కు ముందు ఈ మ్యాచ్ను భారత్కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. అభిషేక్ శర్మ భీకర ఫామ్లో ఉండటం టీమిండియాకు ప్రధాన బలం. గిల్ కూడా టచ్లోనే ఉన్నాడు. పాండ్యా కూడా గత మ్యాచ్లో విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, సూర్య, తిలక్, దూబె, శాంసన్ ఫైనల్కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ పరంగా టీమిండియాకు టెన్షన్ లేదు. కుల్దీప్ స్పిన్ మంత్రంతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుండగా.. వరుణ్ చక్రవర్తి, బుమ్రాలతో బౌలింగ్ యూనిట్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
అయితే, ఫీల్డింగ్ వైఫల్యం జట్టును కష్టాల్లోకి నెడుతుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ల్లో పలు క్యాచ్లు నేలపాలయ్యాయి. ఫీల్డింగ్ తప్పిదాలు ప్రత్యర్థులకు అవకాశాలుగా మారతాయి. కాబట్టి, ఫీల్డింగ్లో లోపాలను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా చూసుకున్న ఈ మ్యాచ్లో టీమిండియానే స్పష్టమైన ఫేవరెట్. హెడ్ టూ హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. టీ20ల్లో ఇరు జట్లు 31 సార్లు ఎదురుపడితే భారత్ 21 విజయాలతో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. శ్రీలంక 9 మ్యాచ్ల్లోనే నెగ్గింది. గ్రూపు దశలో మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గిన శ్రీలంక సూపర్-4లో మాత్రం దారుణంగా నిరాశపర్చింది. రెండు మ్యాచ్ల్లోనూ ఓడి ఎలిమినేట్ అయ్యింది. మరి, భారత్కు ఎంత వరకు పోటీ ఇస్తుందో చూడాలి.






