క్రికెట్ లో అరుదైన సంఘటన.. డీఆర్‌ఎస్‌పై డీఆర్ఎస్

by Dishafeatures2 |
క్రికెట్ లో అరుదైన సంఘటన.. డీఆర్‌ఎస్‌పై డీఆర్ఎస్
X

కోయంబత్తూరు: క్రికెట్‌లో డిసెషన్ రివ్యూ సిస్టమ్(డీఆర్ఎస్)‌పై మళ్లీ డీఆర్ఎస్ తీసుకోవడం ఎప్పుడు చూసి ఉండరు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌(టీఎన్‌పీఎల్)లో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. డీఆర్‌ఎస్‌పై రివ్యూ కోరింది మరెవరో కాదు టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్, వరల్డ్ నం.1 టెస్టు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. బుధవారం రాత్రి దుండిగల్ డ్రాగన్స్, బాల్సే త్రిచీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ జరిగింది. టీఎన్‌పీఎల్‌లో దుండిగల్ డ్రాగన్స్‌ జట్టుకు అశ్విన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బాల్సే త్రిచీ ఇన్నింగ్స్‌లో 12 ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో బ్యాటర్ రాజ్‌కుమార్ ఎదుర్కొన్న 5వ బంతి నేరుగా వికెట్ కీపర్‌ చేతిలోకి వెళ్లింది. అయితే, బ్యాట్‌ను బంతి తాకినట్లు భావించిన అశ్విన్ అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. దాంతో రాజ్‌కుమార్ డీఎఆర్‌ఎస్‌కు వెళ్లగా.. రివ్యూలో నాటౌట్‌గా తేలింది. బ్యాట్ నేలకు తాకగా.. బంతి కాస్త పక్క నుంచి వెళ్లినట్టు గుర్తించి థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు.

థర్డ్ అంపైర్ నిర్ణయంతో సంతృప్తి చెందని అశ్విన్ మరోసారి డీఆర్ఎస్‌కు వెళ్లాడు. మళ్లీ సమీక్షించిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా తేల్చాడు. దాంతో ఒకే బంతిపై ఇరు జట్లు రెండుసార్లు రివ్యూ తీసుకున్నాయి. టీఎన్‌పీఎల్ డీఆర్‌ఎస్‌ను కొత్తగా ఈ ఎడిషన్‌లోనే అమల్లోకి తెచ్చారు. ఈ మ్యాచ్‌లో దుండిగల్ డ్రాగన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. త్రిచీ జట్టు‌ 19.1 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటవ్వగా.. లక్ష్యాన్ని అశ్విన్ నాయకత్వంలోని డ్రాగన్స్ జట్టు 14.5 ఓవర్లలోనే ఛేదించింది. చెపాక్ సూపర్ గిల్లీస్, సేలం స్పార్టాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌలర్ అభిషేక్ తన్వార్ ఒకే బంతికి 18 పరుగులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అశ్విన్ డీఆర్‌ఎస్‌పై డీఆర్‌ఎస్ తీసుకున్న వీడియా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. టీఎన్‌పీఎల్‌లో ఇంకెన్ని వింతలు చూడాలో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed