Archery World Cup : మధుర గురి అదిరింది.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో స్వర్ణంసహా మూడు పతకాలు కైవసం

by Harish |
Archery World Cup : మధుర గురి అదిరింది.. ఆర్చరీ వరల్డ్ కప్‌లో స్వర్ణంసహా మూడు పతకాలు కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత కాంపౌండ్ మహిళా ఆర్చర్ మధుర ధమంగావ్కర్ అదరగొట్టింది. చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2 టోర్నీలో స్వర్ణంసహా మూడు పతకాలు దక్కించుకుంది. మూడు సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో పాల్గొన్న ఆమె అద్భుతంగా పునరాగమనం చేసింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో మధుర గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో ఆమె 139-138 తేడాతో అమెరికాకు చెందిన కార్సన్ క్రాహె‌ను ఓడించింది. అలాగే, మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించింది. అభిషేక్ వర్మతో కలిసి కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్యం గెలుచుకుంది. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో మధుర, అభిషేక్ ద్వయం 144-142 తేడాతో మత్ సల్లె-మహ్మద్ జువైదీ ముజుకి(మలేసియా) జోడీపై గెలుపొందింది. అలాగే, భారత పురుషుల కాంపౌండ్ జట్టు కూడా బంగారు పతకం కైవసం చేసుకుంది. ఫైనల్‌లో అభిషేక్ వర్మ, రిషబ్ యాదవ్, ఓజాస్ ప్రవీణ్‌లతో కూడిన భారత జట్టు 232-228 తేడాతో మెక్సికోపై విజయం సాధించింది. మరోవైపు, పురుషుల కౌంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రిషబ్ యాదవ్ బ్రాంజ్ మెడల్ సాధించాడు.

మెరిసిన జ్యోతి, చికిత

తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ, తానిపర్తి చికిత అంతర్జాతీయ వేదికపై సత్తాచాటారు. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో మధుర‌తో కలిసి జ్యోతి, చికిత రజత పతకం సాధించారు. ఫైనల్‌లో మెక్సిక్ జట్టు చేతిలో 234-222 తేడాతో ఓడిన భారత జట్టు సిల్వర్ మెడల్‌తో సరిపెట్టింది. చికితది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని సుల్తాన్‌పూర్ గ్రామం. మరోవైపు, జ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత స్టార్ ఆర్చర్‌గా ఇప్పటికే గుర్తింపు పొందింది. శనివారం ఒకే భారత్ భారత్ ఖాతాలో ఐదు పతకాలు చేరాయి.




Next Story

Most Viewed