భారత క్రికెటర్లే కెప్టెన్లయితే బాగుండేది: అంజుమ్ చోప్రా

by Malleboina Mahesh |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌(డబ్ల్యూపీఎల్)లోని ఐదు జట్లలో మూడు జట్లకు విదేశీ క్రికెటర్లనే కెప్టెన్‌గా నియమించుకోవడంపై భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారత క్రికెటర్లే కెప్టెన్లయితే బాగుండేది: అంజుమ్ చోప్రా
X

న్యూఢిల్లీ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌(డబ్ల్యూపీఎల్)లోని ఐదు జట్లలో మూడు జట్లకు విదేశీ క్రికెటర్లనే కెప్టెన్‌గా నియమించుకోవడంపై భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారత లీగ్‌లో విదేశీ క్రికెటర్లే ఎక్కువ జట్లకు కెప్టెన్‌గా ఉండటం నాకు నచ్చలేదు. గత ఉమెన్స్ టీ20 చాలెంజ్‌లో కెప్టెన్‌గా ఉన్న దీప్తి శర్మకు పగ్గాలు అప్పగిస్తారనుకున్నా. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు అనుభవజ్ఞులే.. దానికి నేను ఒప్పుకుంటా. అనుభవంపరంగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో మెగ్ లానింగ్‌ను కాదని జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ ఇవ్వలేరు.

భారత్‌లో ఆడుతున్నందున సామర్థ్యం కలిగిన భారత ప్లేయర్లు కెప్టెన్‌గా ఉంటే బాగుండేది’ అని ఆమె తెలిపారు. లీగ్‌లో దేశీయ క్రికెటర్లు కీలక పాత్ర పోషిస్తారని, అంతర్జాతీయ క్రికెటర్లతో ఆడటం వారికి సహాయపడుతుందని చెప్పారు. కాగా, డబ్ల్యూపీఎల్‌లో ఐదు జట్లలో మూడు జట్లు కెప్టెన్సీ పగ్గాలను విదేశీ క్రికెటర్లకే అప్పగించాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను మెగ్ లానింగ్, గుజరాత్ జెయింట్స్‌ను బెత్ మూనీ, యూపీ వారియర్స్‌ను అలీస్సా హాలీ నడిపించనున్నారు. ఈ ముగ్గురు ఆస్ట్రేలియాకే చెందిన వారే కావడం గమనార్హం. ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లకు మాత్రమే భారత క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన సారథ్యం వహిస్తున్నారు.

Next Story