రెండో రౌండ్‌కు సింధు.. ఇంటిదారి పట్టిన శ్రీకాంత్, ప్రణయ్

by Dishanational3 |
PV Sindhu enters into quarter finals in Malaysia Masters 2022
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు రెండో రౌండ్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో జర్మనీకి చెందిన వైవోన్నే లీతో సింధు తలపడింది. తొలి గేమ్ తర్వాత ప్రత్యర్థి రిటైర్డ్ అవడంతో సింధు వాకోవర్ ద్వారా రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు 21-10తో గెలుచుకుంది. రెండో రౌండ్‌లో టాప్ సీడ్, కొరియా షట్లర్ యాన్ సె యంగ్‌తో తలపడనుంది.

యువ క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారిపట్టింది. చైనీస్ తైపీ షట్లర్ పై యు పో చేతిలో 21-16, 21-11 తేడాతో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ ఆటగాళ్లు కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ మరోసారి నిరాశపరిచారు. తొలి రౌండ్‌లో ప్రణయ్ 21-14, 13-21, 13-21 తేడాతో చైనీస్ తైపీ షట్లర్ సు లి యంగ్ చేతిలో పోరాడి ఓడాడు. టాప్ సీడ్, డెన్మార్క్ స్టార్ ప్లేయర్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 21-9, 21-9 తేడాతో శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు.


Next Story

Most Viewed