రైతుబంధు.. ఎన్నికల బాంధవుడేనా?

by  |
రైతుబంధు.. ఎన్నికల బాంధవుడేనా?
X

యాదాద్రిలో అందని పెట్టుబడి సాయం

ఎన్నికలంటే కేసీఆర్ ప్రభుత్వం జోషే వేరు. కావాల్సినన్ని ఓట్లు రాలే వరకు.. పడాల్సినన్ని నోట్లు పడుతూనే ఉంటాయి. ఒక్క‌సారి ఓట్లు, సీట్లు వచ్చాయా.. తలకిందులు తప్పస్సు చేసినా చిల్లర కూడా రాలవు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెచ్చిన రైతుబంధు పథకం పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. అసెంబ్లీ, పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులందరికి పెట్టుబడి సాయం టంఛన్‌గా అందింది. ఇక ప్రభుత్వానికి కావాల్సిన ‘లబ్ధి’ చేకూరింది. కాబట్టి ఇక రైతులకు రావాల్సిన లబ్ధిని మర్చింది. అందుకే కాబోలు యాదాద్రిలో ఈ రబీ సీజన్‌కు 1.62 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు కేవలం 2887 మందికి సాయం అందించింది.

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా పరిధిలోని 17 మండలాల్లో 1.83 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని 2,97,797 మంది రైతులు సాగుచేస్తున్నారు. వీరిలో 1,60,744 మంది రైతులు రబీ సీజన్‌లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందడానికి అర్హులుగా గుర్తించారు. మొత్తం రూ. 235 కోట్లను చెల్లించాలని ప్రతిపాదించారు. కానీ, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు 1,44,847 మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను మాత్రమే ట్రెజరీకి పంపించారు. రూ. 167.87 కోట్లు చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు.

వచ్చింది 2887 మందికే!

రబీ సీజన్ మొదలై నాలుగు నెలలు గడిచిపోయాయి. అయినా, అర్హులైన‌ రైతులందరికీ పెట్టుబడి సాయం అందలేదు. సీజన్ ప్రారంభంలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని గతంలోనే సర్కారు ప్రకటించింది. కానీ, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే వరకూ స్పందించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే విడతల వారీగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 2887 మంది రైతుల ఖాతాల్లో
రూ. 46,14,171లను మాత్రమే జమ చేసింది. అత్యధికంగా వలిగొండ మండలంలో 343 మంది రైతులకు డబ్బులు జమ కాగా, అతి తక్కువగా అడ్డగూడురు మండలంలో 69 మంది రైతులకే వచ్చింది.

మిగిలిన వారికి జమ ఎప్పుడో?

రబీ సీజన్‌కు సంబంధించి ఇంకా 1,41,960 మందికి డబ్బులు జమ కావాల్సి ఉంది. 2018, డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల వరకు రైతుబంధు సొమ్ములు టంఛన్‌గా జమయ్యాయి. ఇక అప్పటి నుంచి నిర్లక్ష్యం మొదలైంది. మళ్లీ మున్సిపల్, సహకార ఎన్నికల హడావుడి మొదలుకాగానే డబ్బులు జమ చేస్తున్నట్టు చేశారు. కేవలం 1 శాతం మందికి మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించారు. ఇక ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. దాదాపు నాలుగేండ్ల పాటు ఎలాంటి ఎన్నికలు లేవు. ఈ నేపథ్యంలో పెట్టుబడి సాయం జమ అవుతుందా లేదా అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.

గత బకాయిలు మర్చిపోవాల్సిందేనా?

రైతుబంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచీ జిల్లాలో పెట్టుబడి సాయం అందుకోని అర్హులైన రైతులు ఉన్నారు. 2018–19 రబీ సీజన్‌లో 1,92,158 మంది రైతులను పథకానికి అర్హులుగా వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. వీరికి రూ. 223.44 కోట్లు చెల్లించాలని ప్రతిపాదించారు. కానీ, 1,62,734 మంది రైతుల ఖాతాల్లో రూ. 198.43 కోట్లు జమ అయ్యాయి. ఇంకా 29,424 మంది రైతులకు రూ. 25.01 కోట్లు రావాల్సి ఉంది. 2019 ఖరీఫ్ సీజన్‌లో 1,81,624 లక్షల మంది రైతులను అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. ఆన్‌లైన్‌లో మాత్రం 1,70,902 మంది రైతుల పేర్లను నమోదు చేశారు. కానీ, 1,45,092 మందికి మాత్రమే పెట్టుబడి సాయం కింద రూ. 187.04 కోట్లు జమ అయ్యాయి. మిగిలిన 25,819 మంది రైతులకు రూ. 70.91 కోట్లు రావాల్సి ఉంది. ప్రస్తుత రబీ సీజన్ రైతులకే పెట్టుబడి సాయం దిక్కులేని పరిస్థితి. ఇక బకాయిల సంగతి దేవుడెరుగు అన్నట్లు ఉంది.


Next Story

Most Viewed