జగన్ తో అంబానీ సమావేశం దేనికి సంకేతం

by  |
జగన్ తో అంబానీ సమావేశం దేనికి సంకేతం
X

వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ సమావేశం రాష్ట్రంలో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని, కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదంటూ టీడీపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో అంబానీతో సీఎం సమావేశం పెట్టుబడులపై కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

వైజాగ్ లో అదానీ కంపెనీ వేల కోట్ల పెట్టుబడులతో సరికొత్త సాఫ్ట్ వేర్ సంస్థను నెలకొల్పాలని ప్రయత్నించింది. అయితే రాష్ట్రంలో అధికార మార్పిడీ నేపథ్యంలో ఆ కంపెనీ పెట్టుబడులను ఉపసంహరించుకుందని టీడీపీ ప్రచారం చేసింది. అయితే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదానీ కంపెనీ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆ కంపెనీ వైజాగ్ లో ఏర్పాటవుతుందా? లేదా? అన్న సందిగ్ధం మాత్రం నెలకొంది. విద్యా, ఆరోగ్య సంస్కరణలు తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఈ నేపథ్యంలో అంబానీ జగన్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తిరుపతి సమీపంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక కంపెనీ పెట్టాలన్న ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ ను అంబానీ కలిశారు. జియో మొబైల్స్ తయారీ యూనిట్ తో పాటు టెలివిజన్ తయారీ పరిశ్రమను పెట్టే ఆలోచనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్ ను ముఖేష్ అంబానీ కలిశారు. ఆయన ప్రతిపాదనకు జగన్ ఒకే చెప్పేశారు. అంతేకాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొత్త కంపెనీకి 152 ఎకరాలను కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో తిరుపతి కేంద్రంగా రిలయన్స్ మొబైల్, టీవీ యూనిట్ త్వరలోనే ఆరంభం కానుంది.

మరోవైపు వైజాగ్ ను రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో వేల కోట్ల పెట్టుబడులు వైజాగ్ లో పెట్టేలా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో యారాడ, వైజాగ్ భీమిలి మధ్యలో గల సాఫ్ట్ వేర్ కారిడార్ లో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి నగరానికి కావాల్సిన అన్ని హంగులు వైజాగ్ లో ఉన్న నేపథ్యంలో రిలయన్స్ అధినేతను వైజాగ్ లో పెట్టుబడుల గురించి ఆలోచించమని సీఎం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలో వైజాగ్ లో కూడా రిలయన్స్ మరోక కంపెనీని ప్రారంభించనుందన్న అంచనాలు నెలకొన్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంబానీలకు కలిసి వచ్చిన రాష్ట్రమన్న సంగతి తెలిసిందే. కేజీ బేసిన్ లో గ్యాస్ ను తవ్వుకునేందుకు స్వేచ్ఛానుమతులిచ్చింది. దీంతో గ్యాస్ ఇక్కడ తవ్వుకుని, పైప్ లైన్ ద్వారా గుజరాత్ కు తరలించుకుని వెళ్తున్నారు. స్థానిక అవసరాలకు సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం వినతిని కూడా రిలయన్స్ సంస్థ పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ను అంబానీ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.



Next Story

Most Viewed