కరోనా ఇష్యూ డైవర్ట్.. ఫోకస్ మొత్తం ఈటలపైనే

by  |
కరోనా ఇష్యూ డైవర్ట్.. ఫోకస్ మొత్తం ఈటలపైనే
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 50 డిగ్రీల ఎండ వేడిమి నుంచి మైనస్ మూడు డిగ్రీల శీతల ఉష్ణోగ్రతకు పడిపోయినట్లుగా రాష్ట్రం దృష్టి మొత్తం ఈటల వైపు మళ్లింది. నిన్నటివరకు కరోనా కేసులు, హైకోర్టులో కేసులు, కోర్టు సూచనలు, వైద్యారోగ్య శాఖ ప్లాన్‌లు అంటూ గుక్క తిప్పుకోకుండా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు కేవలం మంత్రి ఈటల వ్యవహారం తప్ప మరొకటి కనిపించడం లేదు.. వినిపించడం లేదు. ఇష్యూ డైవర్ట్ చేయడంలో ఒక విధంగా ప్రభుత్వం చేసిన ప్లాన్ సక్సెస్ అయిందనే చర్చ సాగుతోంది.

రాష్ట్రంలో నిన్నటి వరకు కరోనా వ్యాప్తిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడి హోం ఐసోలేషన్‌కు పరిమితమయ్యారు. మరోవైపు గవర్నర్ కూడా స్థానికంగా లేరు. సీఎస్‌తో పాటు ఉన్నతాధికారులంతా ఇండ్లకే పరిమితమయ్యారు. కరోనా భయంతో కార్యాలయాలకు రావడం లేదు. అటు కరోనా చావులు పెరుగుతున్నాయి. శ్మశానాల్లో కాల్చేందుకు చోటు కూడా దొరకడం లేదు. ఇలాంటి పరిణామాల్లో హైకోర్టు జోక్యం చేసుకుంటోంది. ఏకంగా ప్రభుత్వానికి గడువు విధిస్తూ హెచ్చరిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం కర్ఫ్యూపై 45 నిమిషాల్లో చెప్పాలంటూ సీఎస్‌ను హెచ్చరించింది. ఇక చావులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఆస్పత్రుల కంటే ఎక్కువగా ఊరూరా శ్మశాన వాటికలు నిర్మించారంటూ సెటైర్లు వేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే టీకా వ్యవహారం కూడా చిక్కుగా మారింది. అటు ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో బెడ్లు లేకపోవడం, కార్పొరేట్​ ఆస్పత్రుల్లో లక్షల్లో బిల్లుల దోపిడి వంటి అంశాలతో రాష్ట్రం అట్టుడుకుతోంది.

కానీ శనివారం రాత్రి నుంచి రాష్ట్రంలో కేవలం ఈటల భూ వ్యవహారం మినహా.. మరో వార్త కూడా ఉండటం లేదు. ఎక్కడ చూసినా ఈటల భూ కబ్జా ఆరోపణల అంశమే. చాలా అంశాల్లో కోర్డు మొట్టికాయలను కూడా పట్టించుకోని ప్రభుత్వం.. శనివారం దీనిపై విచారణకు ఆదేశించింది. సీఎస్, విజిలెన్స్ డీజీకి ఆదేశాలిచ్చారు. శనివారం ఉదయం వరకే నివేదిక ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్ నుంచి హెచ్చరికలు రావడం పరిస్థితిని అంచనా వేయొచ్చు. ప్రస్తుతం కోర్టులు, కరోనా అంశాలతో ప్రభుత్వానికి తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఈటల వ్యవహారంతో ఇష్యూ మొత్తం డైవర్ట్ అయింది. ఇప్పుడు ఈటల వార్త తప్ప మరేది ప్రచారంలో లేదు.

ఎవరూ నోరెత్తవద్ద

మరోవైపు గులాబీ బాస్ నుంచి శనివారం ఉదయం పార్టీ శ్రేణులకు అత్యవసర ఆదేశాలు జారీ అయ్యాయి. ఈటల వ్యవహారంలోపార్టీ నేతలు నోరెత్తవద్దని, ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదంటూ సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలందరికీ ఈ సమాచారమిచ్చారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలకు స్పష్టంగా హెచ్చరికలు జారీ అయ్యాయి. వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో నేతలు మంత్రి ఈటలకు మద్దతుగా వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు గులాబీ బాస్ అప్రమత్తమై ఈ ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed