నెగెటివ్ ​వచ్చినా వదిలిపెట్టేదేలేదు.. ఎవరికైనా సరే ఇవే రూల్స్

by  |
negative1
X

దిశ, తెలంగాణ బ్యూరో: విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులకు ఎయిర్​పోర్టులో నిర్వహించే టెస్టులో నెగెటివ్​వచ్చినా వైద్యశాఖ పూర్తిస్థాయిలో నిఘా పెట్టనుంది. వారిని హోం క్వారంటైన్ చేస్తూ మొదటి టెస్ట్ చేసిన తేదీ నుంచి 8వ రోజుకు మరోసారి ఆర్టీపీసీఆర్​పరీక్షను నిర్వహించనున్నారు. పాజిటివ్​వస్తే సదరు బాధితులను టిమ్స్​కు తరలించి, ప్రైమరీ కాంటాక్ట్​లకు టెస్టులు చేసి క్వారంటైన్​విధిస్తున్నారు. ఒకవేళ నెగెటివ్ వస్తే ఆ తర్వాత మరో 7 రోజుల పాటు నిర్బంధంలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఇలా 14 రోజుల పాటు క్షేత్రస్థాయి హెల్త్ కేర్​వర్కర్లు పుల్​ఫోకస్ పెట్టనున్నారు.

టిమ్స్ లో చికిత్స…

విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులకు కరోనా పాజిటివ్ అని​తేలితే వెంటనే టిమ్స్​కు తరలించనున్నారు. ఈ మేరకు అక్కడ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఎట్​రిస్క్​తో పాటు మరే దేశం నుంచి వచ్చేవారైనా సరే ఇవే నిబంధనలను వర్తింపజేస్తున్నారు. బుధవారం రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్​కు వచ్చిన 325 విదేశీ ప్రయాణికులకు టెస్టులు చేయగా, ఓ మహిళ(35)కు కరోనా పాజిటివ్ గా​నిర్ధారణ అయిందని డీహెచ్​డా జీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆమె రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ అని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని డీహెచ్ తెలిపారు. ఆమె శాంపిల్​ను వేరియంట్లను నిర్ధారించే జీనోమ్​సీక్వెన్సింగ్ టెస్టుకు పంపామని, మరో రెండు రోజుల్లో ఆ ఫలితం వస్తుందన్నారు. మిగతా వారిని క్వారంటైన్​చేసి వివరాలను జిల్లా సర్వేలెన్స్ కమిటీకి పంపించామన్నారు. వారు 14 రోజుల పాటు మానిటరింగ్​ చేస్తారన్నారు. ఈ మధ్యలో 8వ రోజు వారందరికీ మరోసారి ఆర్టీపీసీఆర్​ను నిర్వహిస్తామన్నారు.


Next Story

Most Viewed