‘కిమ్’.. సౌత్‌ కొరియన్ తొలి ఏఐ యాంకర్

by  |
‘కిమ్’.. సౌత్‌ కొరియన్ తొలి ఏఐ యాంకర్
X

దిశ, వెబ్‌డెస్క్: సౌత్‌కొరియాకు చెందిన ‘ఎమ్‌బీఎన్’ అనే టెలివిజన్ చానెల్‌లో ఓ యాంకర్ వార్తలు చదువుతోంది. చూడ్డానికి చాలా అందంగా, యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా కనిపించింది. అందులో విశేషమేముంది అంటారా? ఆ యాంకర్ ప్రాణమున్న మనిషి కాదు, టెక్నాలజీతో రూపం పోసుకున్న అద్భుత సృష్టి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇదివరకే చైనా ఓ న్యూస్ యాంకర్‌ను సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌత్ కొరియా కూడా చైనాలో బాటలో నడుస్తోంది. సౌత్ కొరియాకు చెందిన ఎమ్‌బీఎన్ టెలివిజన్ చానల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రొడక్షన్ కంపెనీ ‘మనీ బ్రెయిన్‌’తో కలిసి ఆసియా దేశపు తొలి ఏఐ పవర్డ్ న్యూస్ యాంకర్‌ను రూపొందించింది. ఈ ఏఐ యాంకర్.. ఎమ్‌బీఎన్ చానల్‌కు చెందిన రియల్ యాంకర్ ‘జిమ్ జు హ’ను ఇమిటేట్ చేస్తూ వార్తలు చదివింది. అంతేకాదు జిమ్‌తో కలిసి కాసేపు సంభాషించింది. కాగా ఆ ఇద్దరినీ తెరపై చూస్తే డబుల్ యాక్షన్ సినిమా చూసినట్లే కనిపిస్తోంది.

రోబో సినిమాలో చిట్టి తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నట్లుగా.. ఇక్కడ కిమ్ (ఏఐ యాంకర్ పేరు) కూడా అలాగే పరిచయం చేసుకుంది. ‘నేను జిమ్‌ జు హాను దాదాపు 10 గంటల పాటు పరిశీలించాను. ఆమె వాయిస్‌ గమనించాను, ఎలా మాట్లాడుతుంది, ఫేసియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇస్తుంది, లిప్ మూవెంట్ ఏ విధంగా ఉంది, తన శరీరాన్ని ఏ విధంగా కదిలిస్తుంది తదితర విషయాలన్నింటినీ గమనించాను. ఆమె ఏ విధంగా రిపోర్ట్ చేస్తుందో నేను కూడా అదే విధంగా రిపోర్ట్ చేస్తాను’ అని కిమ్ చెబుతుండటం విశేషం.

హ్యుమన్ యాంకర్స్ అందుబాటులో లేనప్పుడు ‘ఏఐ’ యాంకర్స్‌తో రిప్లేస్ చేయాలని ఎమ్‌బీఎన్ చానల్ భావించడంతో పాటు టెక్నాలజీని వాడుకుంటే అద్భుతాలు చేయవచ్చని చెబుతోంది. రాబోయే రోజుల్లో హ్యుమన్ యాంకర్స్‌ను ‘ఏఐ’ యాంకర్స్ రిప్లేస్ చేసే అవకాశం ఉందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే, ఓ వార్తను విశ్లేషించి చెప్పడం, ఆ వార్త ప్రాముఖ్యతను తెలుసుకోవడం, అప్పటికప్పుడు తగిన మార్పులు చేసుకోవడం మనుషుల వల్లే సాధ్యమవుతుంది. ప్రముఖులకు, దేశానికి సంబంధించిన వార్తలతో పాటు కొన్ని కీలకమైన వార్తల్లో ఏ చిన్న పొరపాటు దొర్లినా చానల్ మనుగడకే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.


Next Story

Most Viewed