'సార్ ప్లీజ్.. మా పరీక్ష మమ్మల్నే రాసుకోనివ్వండి'

by  |
సార్ ప్లీజ్.. మా పరీక్ష మమ్మల్నే రాసుకోనివ్వండి
X

దిశ, రంగారెడ్డి: కొంతమంది విధులకు సరిగా హాజరుకాలేదు. అది పూడ్చుకునేందుకు తప్పుడు పనులకు పాల్పడ్డారు. ఆ ఊబిలోకి అమాయకులను లాగి వారిని రోడ్డుపాలు చేశారు. అది గమనించిన వీళ్లు మాకెందుకు ఆ గొడవ.. మీరే చేసుకోండి అంటూ పక్కకు జరిగారు. ఇదే అదునుగా భావించిన ఇంకొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మా పని మమ్మల్ని చేసుకోనివ్వండంటూ చెప్పేస్తున్నారు. అదేంటో మీరే చూడండి..

కొంతమంది టీచర్లు విద్యను బోధించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.. కానీ, మాస్​ కాపీయింగ్​ కు పాల్పడేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఈ దుస్థితి రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోంది. ప్రతి ఏడాది ప్రైమరీ స్కూల్​లో విద్యను బోధించే ఉపాధ్యాయులు మాత్రమే విధుల్లో పాల్గొంటారు. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచో వస్తోంది. ఎందుకంటే హైస్కూల్​ ఉపాధ్యాయులకు పదో తరగతి సబ్జెక్టు బోధిస్తారు. దీంతో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రమాదం ఉంటుందని ఈ పద్ధతిని ప్రభుత్వాలు అవలంభిస్తున్నాయి. ఈ ఏడాది నిర్వహించే పదో తరగతి పరీక్షలకు ఎస్​జీటీ ఉపాధ్యాయులను దూరం చేసి స్కూల్​ అసిస్టెంట్​ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉండే ఉపాధ్యాయులకు డ్యూటీ వేశారు. ఉపాధ్యాయులు తమను రక్షించుకునేందుకు తప్పుడు విధానాలకు తెరలేపుతున్నట్లు సమాచారం. స్కూల్​ అసిస్టెంట్​ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తే తమ విద్యార్థులను పాస్​ చేసుకునే అవకాశం ఉంటుందని, దీంతో ఉపాధ్యాయులకు విద్యార్థుల ఉత్తీర్ణత బట్టి సబ్జెక్టుల వారీగా పరిశీలించి ఇంక్రీమెంట్​ వేస్తారన్న ధోరణితో ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం.

ఆసక్తి చూపని ఎస్​జీటీలు..

పదో తరగతి పరీక్షలకు ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తించేందుకు ఎస్​జీటీ ఉపాధ్యాయులు ఆసక్తి చూపడంలేదు. ఇదే అదునుగా భావించిన హైస్కూల్​ ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించేందుకు సిద్ధపడ్డారు. అయితే.. గతంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో విధులు నిర్వర్తించిన ఎస్జీటీలను ఏడుగురిని డిస్మిస్​ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ హైస్కూల్​లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విధుల్లో ఉన్న ఎస్​జీటీలపై ఒత్తిడి తీసుకువచ్చారని, దీంతో వాళ్లు మాస్​ కాపీయింగ్​‌ను ప్రోత్సహించండంతో ఆ ఏడుగురు ఏస్జీటీలు సస్పెన్షన్‌తో పాటు డిస్మిస్​ అయ్యే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. గతంలో జరిగిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఎస్​జీటీలు ఈ పరీక్షల్లో విధులు నిర్వర్తించేందుకు సుముఖత చూపడంలేదని, ‘విధులు నిర్వర్తించి, ఒత్తిడికి లోనై మాస్​ కాపీయింగ్​ చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. ఇదంతా మాకెందుకు వచ్చిన తంటా’ అన్న ధోరణితో వారు ఉన్నట్లు సమాచారం. ఇన్విజిలేటర్ విధులకు ఎస్​జీటీలు హాజరు కాకపోవడంతో స్కూల్​లు సెలవులున్నప్పటికీ టీచర్లు యథావిధిగా స్కూల్​కు వెళ్లాలని ప్రిన్సిపల్​ సెక్రటరీ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

జిల్లాలో 208 పరీక్షా కేంద్రాలు..

నేటి నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ఏఫ్రిల్​ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలో మొత్తం 937 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అందులో 208 పరీక్షాకేంద్రాలుగా గుర్తించారు. వాటిలో రెగ్యులర్‌ 201, ప్రైవేట్‌ పరీక్షాకేంద్రాలు 7 ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలకు 47,155 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, ఒకసారి ఫెయిల్‌ అయిన విద్యార్థులు 1,450 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,025 మంది ఇన్విజిలెటర్లను నియమించారు. ఇందులో 70 శాతం మంది స్కూల్​ అసిస్టెంట్​లే ఉన్నట్లు సమాచారం.

మా పరీక్షలు మేమే రాస్తాం..

విధులకు సక్రమంగా హాజరుకాని కొంతమంది ఉపాధ్యాయులు తమ సబ్జెక్టుల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గమనించిన కొంతమంది విద్యార్థులు మా పరీక్షలు మమ్ముల్నే రాసుకోనివ్వండంటూ అన్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఉపాధ్యాయులు.. అలాంటి ఇన్విజిలెటర్స్ కారణంగా చదువులో ప్రతిభ కలిగిన విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మండిపడుతున్నారు.

కరోనాతో జాగ్రత్తలు..

కరోనా వైరస్​ సోకకుండా ఉండేందుకు పలువురు విద్యార్థులు పలు జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలకు హాజరయ్యారు. పదేపదే నీళ్లు​ తాగేందుకు తమ వెంట వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నారు. మాస్కులు కూడా ధరించారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల కోసం శానిటైజర్స్ ను ఏర్పాటు చేశారు.

Tags : mass copying, Rangareddy, Students, Teachers

Next Story

Most Viewed