పైన వేరుశనగ బస్తాలు.. కింద అక్రమ మద్యం

by  |

దిశ, నల్లగొండ: గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ నుంచి ఏపీకి మద్యాన్ని అక్రమంగా తరలించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే విస్తుపోవాల్సి వస్తోంది. అసలు ఆ ఆలోచనలు ఎట్లొస్తున్నాయో అర్థం కావడంలేదంటూ మరికొందరు అంటున్నారు. మద్యాన్ని తరలించేందుకు వాళ్ల ప్రయత్నాలు చివరి క్షణంలో మాత్రమే బయటపడుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ వ్యక్తి స్కూటీ ముందు భాగంలో భారీగా మద్యం బాటిళ్లను తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అదే రీతిలో నేడు కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఏపీకి మద్యం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్​స్టేషన్ పరిధిలోని దుర్గాపురం స్టేజీ వద్ద కోదాడ పట్టణం నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని అనంతగిరి పోలీసులు పట్టుకున్నారు. సుమారు 1.50 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోదాడ పట్టణంలోని ఓ వైన్స్​లో మద్యం కొనుగోలు చేసి.. వేరుశనగల తరలింపు ముసుగులో.. వేరుశనగల కింద మద్యం బాటిళ్లను దాచి గుంటూరు జిల్లా తెనాలికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు రెండు ఆటోలను సీజ్​ చేసి.. ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అనంతగిరి ఎస్సై రామాంజనేయులు తెలిపారు.



Next Story