‘కారు’దిగి సొంతగూటికి..

by  |
‘కారు’దిగి సొంతగూటికి..
X

అధికారం కోసం పార్టీ మారిన నేతలు నేడు క్రమంగా సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ ​జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్​ చైర్మన్లు కారు దిగేందుకు రెడీ అవుతున్నారు. అధికార పార్టీ ఆగడాలతో పనులు జరగడం లేదని చైర్మన్లు, కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారినా ఫలితం లేకుండా పోయిందని మదనపడుతున్నారు. పార్టీ కోసమైనా, ప్రజలకోసమైనా ఏ పనిచేయాలన్నా వారికి చెప్పి చేయాల్సిందేనంటున్నారు. దీంతో విసిగిపోయిన రెండు జిల్లాలోని 17 మున్సిపాలిటీ పరిధిలోని పలువురు చైర్మన్లు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గ్రేటర్ శివారులోని మున్సిపాలిటీల్లో తమదే పైచేయిగా నిలువాలని టీఆర్ఎస్ తపన పడింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కలిపి 7 మున్సిపల్​ కార్పొరేషన్, 21 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని సంబురపడింది. అయితే బడంగ్​పేట్, మీర్​పేట్ కార్పొరేషన్ల లో ఏ పార్టీ పూర్తి మెజార్టీ రాలేదు. కానీ, చివరికి టీఆర్ఎస్ ఖాతాలోకి పోయాయి. కానీ, మున్సిపాలిటీల్లో 13 వాటిలో పూర్తి మెజార్టీ ఉంది. రెండింటిలో కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఒకటి ఎంఐఎంకి అవ కాశం ఉంది. మిగిలిన రెండింటిలో కాంగ్రెస్.. ఒకటి బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికి టీఆర్ఎస్ ఎక్స్ ఆఫిషియోతో పాటు, ఇతర పార్టీ కౌన్సిలర్ల మద్దతు తీసుకుని చైర్మన్ పదవి దక్కించుకున్నారు. కానీ, ఏడాది కాలం ముగియక ముందే టీఆర్ఎస్ పార్టీ ఆగడాలను గుర్తించి పార్టీని విడుతున్న వైనం కనిపిస్తోంది. ఆదిబట్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీని తగ్గించేందు కు టీఆర్ఎస్ ఎత్తుగడలో కౌన్సిలర్ హార్థిక చిక్కుకుంది. చివరికి టీఆర్ఎస్ చైర్మన్ పదవితో కట్టబెట్టింది. కానీ స్థానిక ఎమ్మెల్యే, అనుచరుల సహకారం లేదు. మున్సిపల్ కమిషనర్ మద్దతు లేకపోవడంతో వ్యక్తిగత ఎదుగుదలను అడ్డుకుంటున్న వైనం గుర్తించారు. దీంతో ఆదిబట్ల చైర్​పర్సన్ హార్థిక ప్రవీణ్ గౌడ్ చూసి తిరిగి సొంతగూటికి ఎంపీ కొమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఆధ్వర్యం లో చేరారు. ఇదే పరిస్థితి మిగిలిన మున్సిపాలిటీలో తలెత్తుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ గెలిచిన తీరు ఇదీ..

ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 15 వార్డులుంటే కాంగ్రెస్ 8 స్థానాలు, టీఆర్ఎస్ 6, బీజేపీ ఒకటి చొప్పున కౌన్సిలర్లను గెలి చారు. కానీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంతో ఎక్స్ అఫిషియో సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకుంది. అధికార పార్టీ తెలివిగా కాంగ్రెస్ పార్టీ కౌ న్సిలర్​నే మున్సిపల్ చైర్​పర్సన్​గా నియామించింది.

పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులకు గాను కాంగ్రెస్‌ 13, టీఆర్ఎస్‌ 8, బీజేపీ 1, స్వతంత్రులు ఇద్దరు చొప్పున గెలిచారు. అయితే చైర్మన్‌ పీఠం దక్కించుకోవాలంటే 13 వార్డుల సభ్యుల మద్దతుంటే చాలు. అందుకు కాంగ్రెస్‌ బలం సరిపోతుం ది. కానీ, ఎక్స్‌ అఫిషియో సభ్యుల మద్దతుతో పాటు స్వతంత్ర అభ్యర్థి, కాంగ్రెస్‌లోని నలుగురు అభ్యర్థుల మద్దతు టీఆర్‌ఎస్‌కు ఉండ టంతో చైర్మన్‌ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థికి వైస్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడంతో సర్ధుకుపోయారు. నేడు ఆ పరిస్థితి లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర పార్టీలో గెలిచి మద్దతు ప్రకటించిన కౌన్సిలర్లకు ప్రాధా న్యం లేదని స్పష్టమవుతోంది. త్వరలోనే ఇక్క డి నుంచి కాంగ్రెస్ గూటికి వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

తుక్కుగూడ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులున్నాయి. ఇందులో 5 వార్డులు టీఆర్‌ఎస్‌, 9వార్డులు బీజేపీ, ఒకటి స్వతంత్రుల చొప్పున గెలుచుకున్నారు. కానీ, తుక్కుగూడ మున్సిపాలిటీని దక్కించుకోవాల్సింది బీజేపీ పార్టీ. అయితే అధికార టీఆర్ఎస్ ఎక్స్‌అఫిషియో సభ్యులతో చైర్మన్​గిరిని కైవసం చేసుకున్నారు. బీజేపీకి మద్దతుగా రాజ్యసభ సభ్యులు గరికెపాటి రాంమోహన్‌ రావు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ మున్సిపాలిటీ చైర్మన్ వ్యవహారంతో ఆ పార్టీ కౌన్సిలర్లే విసుగెత్తి పోతున్నారు. కౌన్సిలర్లు చైర్మన్​ను వ్యతిరేకిస్తున్నారు. దీంతో చైర్మన్, కౌన్సిలర్లు బీజేపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.

డైలమాలో పలువురు..

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల చైర్మన్లు పార్టీ విడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ పనులు జరగడం లేదనే ఆవేదనలో ఉన్నారు. ఒక వైపు, ఎమ్మెల్యే, మరో వైపు మంత్రి, వీరు గాకుండా ఎంపీలు మున్సిపాలిటీలో జోక్యం చేసుకుని చైర్మన్లకు, కౌన్సిలర్లకు స్వతంత్రం లేకుండా చేస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి పనిచేయాలంటే నిబంధనలున్నాయని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి చెబుతుంటారు. చైర్మన్ పరిధిలో ఉన్న పనులకు పై అనుమతులు కావాలని స్థానిక కమిషనర్లను అడ్డుపెట్టుకుని వ్యవహరిస్తున్నారు. పార్టీ కోసం పనిచేయాలన్న, ప్రజల కోసం పనిచేయాలన్న చెప్పి చేయాలంటే ఏలా అని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు జిల్లాలోని 17 మున్సిపాలిటీ పరిధిలోని పలువురు చైర్మన్లు పార్టీలు మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో చైర్మన్లు డైలమాలో ఉన్నట్లు సమాచారం.

Next Story

Most Viewed