మరికొన్ని ఆసక్తికరమైన క్రీడా వార్తలు..

by  |
sports news
X

దిశ, స్పోర్ట్స్: రాజస్థాన్ మాజీ రంజీ ఆటగాడు వివేక్ యాదవ్ కరోనా కారణంగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మృతి చెందాడు. 36 ఏళ్ల వివేక్ యాదవ్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. వివేక్ మిత్రుడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.

– టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గురువారం కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఐపీఎల్ వాయిదా పడటంతో బయోబబుల్ నుంచి బయటకు వచ్చిన ధావన్ ముందుగా వ్యాక్సిన్ తీసుకొని ఇంటికి చేరుకున్నారు. కరోనా పోరాటంలో ముందు ఉన్న వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదములు తెలిపారు. టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ధావన్ మాత్రమే.

– ఇండియా నుంచి వచ్చే విమానాలపై మలేషియా ప్రభుత్వం నిషేధం విధించింది. ఒలంపిక్స్‌కు అర్హత సాధించాలంటే బ్యాడ్మింటన్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ తప్పకుండా కౌలాలంపూర్‌లో మే 25 నుంచి 30 వరకు జరిగే అర్హత టోర్నీలో పాల్గొనాల్సి ఉన్నది. ఆ తర్వాత జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్‌లో కూడా తమ ర్యాంకును మెరుగు పరుచుకునే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు భారత ప్రయాణికులపై నిషేధంతో బ్యాడ్మింటన్ ఆటగాళ్ల అర్హత అగమ్యగోచరంగా మారింది.

– సన్‌రైజర్స్ ఆటగాడు వృద్దిమాన్ సాహ ఇతర జట్ల ఆటగాళ్లతో టచ్‌లో లేకపోయినా అతడికి కరోనా ఎలా సోకిందో మాకు అర్దం కావడం లేదని ఎస్ఆర్‌హెచ్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. జట్టు మొత్తం కఠిన బయోబబుల్‌లో ఉండటంతో ఎవరికీ కరోనా సోకలేదని.. కానీ సాహాకు రావడం పట్ల ఆశ్చర్యంగా ఉందన్నాడు.


Next Story