దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

by  |
దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. ఇంతకాలం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి ఇటీవల చనిపోయిన సొలిపేట రామలింగారెడ్డి భార్యకే ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఒక ప్రకటనను పార్టీ వర్గాలు విడుదల చేశాయి. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా అధికారికంగా అభ్యర్థి పేరును ఖరారు చేయలేదు. తొలుత ఖరారు చేసింది టీఆర్ఎస్ పార్టీయే. దివంగత ఎమ్మెల్యే కుటుంబానికే టికెట్ ఖరారుచేసే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పటికీ భార్య పేరును పరిశీలిస్తారా లేక కుమారుడి పేరును పరిశీలిస్తారా అనే సందేహం నెలకొనింది. మరో నాలుగైదు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందనగా సోమవారం రాత్రి సుజాత పేరును ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

సొలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని, పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగారని, ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని కేసీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకూ కష్టపడి పనిచేశారని, రామలింగారెడ్డి కుటుంబం మొత్తం అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలు పంచుకుందని గుర్తుచేశారు. నియోజకవర్గ ప్రజలతో ఆ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉందని, రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా అమలుకావడానికి ఆయన కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాతినిధ్య వహించడం సమంజసమని పేర్కొన్నారు. జిల్లా నాయకులతో సంప్రదింపులు జరిపిన సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు కేసీఆర్ తెలిపారు.



Next Story

Most Viewed