మట్టితో ఆయన అక్రమంగా రూ. 15 లక్షలు సంపాదించాడు

by  |
మట్టితో ఆయన అక్రమంగా రూ. 15 లక్షలు సంపాదించాడు
X

దిశ, రంగారెడ్డి: కోహెడ పండ్ల మార్కెట్​ మొదటి నుంచి వివాదాలకు కేంద్రంగా మారుతోంది. తాత్కాలిక మామిడి విక్రయాల కోసం చేపట్టిన తాత్కాలిక షెడ్​ల నాసిరకంగా ఉండటం వల్ల ఈదురు గాలులకు షెడ్డులు​ కుప్పకూలి పలువురు గాయాలయ్యాయి. దీనిపై వచ్చిన విమర్శలు ఇంకా సమసి పోకముందే కోహెడ​ మార్కెట్​లో మరో గోల్​మాల్​ వెలుగులోకి వచ్చింది. ‘అవినీతికి కాదేది అనర్హం’ అన్న చందంగా ఒక ఇంజినీరింగ్​ అధికారి మట్టి గోల్​మాల్​కి తేరలేపాడు. మార్కెటింగ్​ శాఖాధికారులకు, పాలకవర్గ సభ్యులకు తెలియకుండా రూ.15 లక్షల విలువ చేసే మట్టిన మార్కెట్ నుంచి ఓ నిర్మాణ సంస్థకు గుట్టుచప్పుడు కాకుండా తరలించాడు.

అధికారి చేతివాటం…

గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్​ తరలింపు చర్యల్లో భాగంగా కోహెడ పండ్ల మార్కెట్​లో మార్కెట్​ కమిటీ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా గుట్టలుగా ఉన్న స్థలాన్ని చదును చేసి తాత్కాలిక షెడ్డులు, ఇతరత్ర పనులు చేపడుతున్నారు. ఈ పనులన్నీ గడ్డి అన్నారం మార్కెట్​ కమిటీ పాలకవర్గం ఉన్నత శ్రేణీ కార్యదర్శి కోహెడ ఇన్ చార్జి కార్యదర్శి ఆధ్వర్యంలో చేపడుతున్నప్పటికీ నిర్మాణ పనుల్లో ఇంజనీరింగ్​ విభాగం అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్​ విభాగం ముఖ్యాధికారి నిర్మాణ పనుల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. పాలక వర్గానికి గానీ, ఉన్నతశ్రేణి కార్యదర్శి, కోహెడ​ ఇన్ చార్జి కార్యదర్శికి తెలియకుండా మట్టిని ఓ నిర్మాణ సంస్థకు గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. సదరు నిర్మాణ సంస్థ నుంచి రూ.15 లక్షల నగదును సదురు అధికారికి ముట్టినట్టు సమాచారం. మట్టి తరలింపు విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పాలకవర్గం, అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు.

నోటీసులు జారీ చేసిన చైర్మన్​..

మార్కెట్​ కమిటీ చైర్మన్​ రామ్​నర్సింహా గౌడ్​ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మట్టి గోల్​మాల్​ వ్యవహారంపై విచారణ జరిపి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలంటూ అధికారులకు నోటీసులు జారీ చేశారు.

తనను విధుల నుంచి తొలగించాలని లేఖ..

కోహెడ మార్కెట్​కు ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న గ్రేడ్​‌‌–3 కార్యదర్శి చిలుక నర్సింహ‌రెడ్డి తనకు తెలియకుండా మట్టి తరలింపు విషయానికి మనస్తాపానికి గురై తనను కోహెడ ఇన్ చార్జి విధుల నుంచి తొలగించాలని కోరుతూ అధికారులకు లేఖ సమర్పించడం విశేషం. గోల్​మాల్‌‌కు పాల్పడిన సదరు ఇంజనీరింగ్​ అధికారులు స్థానికంగా కొందరు ప్రజాప్రతినిధుల అండందండలు ఉండటంతోనే ఇంత సాహసానికి ఒడిగట్టాడని సమాచారం.



Next Story