సాఫ్ట్‌వేర్ కపుల్.. గ్యారేజ్ డైరీఫామ్!

by  |
సాఫ్ట్‌వేర్ కపుల్.. గ్యారేజ్ డైరీఫామ్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆ జంట పనిచేసేది సాఫ్ట్‌వేర్ కంపెనీలో.. కానీ పార్ట్‌టైమ్‌గా చేస్తున్న పని డైరీఫామ్ నిర్వహణ. వారు చేసే ఫుల్‌టైమ్ జాబ్‌కు పార్ట్‌టైమ్ జాబ్‌కు ఏ మాత్రం సంబంధం లేదు. అయినప్పటికీ వారు ఎంతో ఆసక్తితో చేస్తున్నారు. అయితే ఇదంతా ఎలా జరిగింది? ఏసీ గదుల్లో పనిచేసే వారు తమ గ్యారేజీలో డైరీఫామ్ పెట్టాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ముందు వారి ఉదాత్త స్వభావాన్ని తెలుసుకోవాలి. అందుకు అక్కడి జల్లికట్టు గురించి మాట్లాడుకోవాలి. 2017లో జల్లికట్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న సమయంలో స్థానిక ఆవు జాతులను కాపాడాలని ఈ జంట నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే ఇవాళ ఈ దంపతులు ఒక డైరీఫామ్ పెట్టి, నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి చేర్చింది. ఇంతకీ ఆ జంట పేరు చెప్పలేదు కదూ..

ఆ దంపతుల పేరు ప్రీతా, మణికందన్. వ్యవసాయం, పశుపోషణ అంటే వీరికి చాలా ఇష్టం. జల్లికట్టు సమయంలో కంగేయమ్ కాలై అనే స్థానిక ఆవు జాతి గురించి తెలిసి, దాన్ని కాపాడాలని ఈరోడ్ వెళ్లారు. ఆ ఆవును చూడగానే వారికి కొనాలనిపించింది. మరో ఆలోచన చేయకుండా ఆ ఆవును కొనేసి అడంబక్కంలోని తమ 500 చదరపు అడుగుల గ్యారేజీలో కట్టేశారు. దాన్ని ఎలాంటి ఆహారం ఇవ్వాలి, పాలు ఎలా పితకాలి లాంటివేవీ వారికి తెలియదు. ఆవులను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి వారాంతాల్లో పశువుల శాలలకు వెళ్లేవారు. సాధారణంగా కుక్కలను, పిల్లులను పెంచుకున్నట్లుగానే వీటిని కూడా పెంచడం సులభమని వారు తెలుసుకున్నారు. అంతే.. ఇంకొన్ని ఆవులు కొనాలని నిర్ణయించుకున్నారు.

తర్వాత వాటి సంరక్షణ కోసం పని చేసే వారితో పాటు ఆ పశువుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు, పేడ, యూరిన్‌ల మార్కెటింగ్ గురించి కూడా తెలుసుకున్నారు. ఇక వెనక్కితిరగకుండా వారి 500 చదరపు అడుగుల గ్యారేజీనే పశువుల పాకగా మార్చేసి, డైరీఫామ్ చేసేశారు. ఇప్పుడు కేవలం పాలఉత్పత్తుల ద్వారా మాత్రమే కాకుండా పంచగవ్య, జీవామృతం, విభూతి, క్రిమిసంహారకాలు, సబ్బులు మొదలగు వాటి తయారీ గురించి కూడా నేర్చుకుని డైరీఫామ్‌లో ఏ ఒక్క ఉత్పత్తిని కూడా వృథాగా పోనివ్వడం లేదు. ఇప్పుడు తమ గ్యారేజీలో 10 ఆవులతో పాటు వేరే చోట స్థలం అద్దెకు తీసుకుని మరో 9 పశువులను పెంచుతున్నారు. అనుకోకుండా ప్రారంభించిన ఈ పని తమకు లాభాలను తెచ్చిపెడుతుండటమే కాకుండా వారాంతాల్లో కావాల్సినంత సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తోందని ప్రీతా, మణికందన్ అంటున్నారు.


Next Story

Most Viewed