ఇంతకూ రాష్ట్రంలో ఖాళీ పోస్టులెన్ని..?

by  |
cm-kcr government
X

దిశ, తెలంగాణ బ్యూరో : త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో ఏ శాఖలో ఎన్ని పోస్టులున్నాయో లెక్క తీసే పని దాదాపు పూర్తయింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో అన్ని శాఖలతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆదివారం కీలక సమావేశం జరిగింది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, ఖాళీగా ఉన్నవి, ఏ జోన్ పరిధిలోకి వెళ్తాయి, మల్టీ జోనల్ సిస్టమ్‌తో ఎలాంటి చిక్కులున్నాయి తదితరాలన్నింటిపై ఉన్నతాధికారుల నుంచి వివరాలను సేకరించారు.

ఏ శాఖలో ఎన్ని పోస్టులను భర్తీ చేయాలో నిర్ణయం తీసుకోవడంలో భాగంగా ఈ సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శికి సోమవారం నివేదికను సమర్పించనున్నారు. ఆ తర్వాత ఈ నెల 13న ప్రగతి భవన్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరగనున్నది. అక్కడ జరిగే నిర్ణయం ఆధారంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. వీలైనంత తొందరగా నోటిఫికేషన్లను జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో రోజుల వ్యవధిలోనే వివిధ దశల్లో ప్రక్రియలు ఊపందుకున్నాయి. మొత్తం 22 శాఖల నుంచి వివరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఉదయం మొదలు సాయంత్రం వరకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో చర్చలు నిర్వహించారు.

ప్రాథమికంగా అన్ని విభాగాల నుంచి వివరాల సేకరణ గతంలోనే పూర్తయినప్పటికీ కొన్ని చోట్ల డిప్యూటేషన్లు, మరికొన్ని చోట్ల ఔట్‌సోర్సింగ్ నియామకాలు, ఇంకొన్ని చోట్ల తాజాగా రిటైర్ అయినవారు.. ఇలాంటి అనేక అంశాలపై ఆదివారం సమావేశంలో చర్చ జరిగింది. ప్రత్యక్ష నియామకాల (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ద్వారా ఎన్ని పోస్టుల్ని ఏయే శాఖలో భర్తీ చేయడానికి పరిస్థితి అనుకూలంగా ఉన్నది, ఏయే పోస్టుల భర్తీకి ఎలంటి లీగల్ చిక్కులున్నవి.. లాంటి వివరాలన్నింటిపైనా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో చర్చించారు. కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో భర్తీకి అన్ని చిక్కులూ తొలగిపోయాయని సీఎం ఇటీవల వ్యాఖ్యానించారు. ఆ ప్రకారం ముందుడుగు పడింది.

ఈ సమావేశంలో వచ్చిన వివరాల ఆధారంగా ప్రధాన కార్యదర్శికి సోమవారం ఆయన నివేదిక సమర్పించనున్నారు. ఆ తర్వాత అది ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు చేరుతుంది. అనంతరం ఈ పోస్టుల భర్తీకి ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందనే అంశంపై మంత్రివర్గంలో చర్చ జరిగిన తర్వాత భర్తీకి ఆమోదముద్ర లభిస్తుంది. దాని ప్రకారం నోటిపికేషన్లు వెలువడతాయి. తొలిదశలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యే పోస్టుల్ని మరో దశలో భర్తీ చేయనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు.


Next Story

Most Viewed