వాళ్లకు కరోనా కలిసొచ్చింది.. అనుకున్న పని కానిచ్చారు

by  |
వాళ్లకు కరోనా కలిసొచ్చింది.. అనుకున్న పని కానిచ్చారు
X

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజ్ పరిధిలో అడవి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ వ్యవహారంలో అటవీ అధికారుల ప్రమేయం ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కలప స్మగ్లర్లు అటవీ అధికారులపై దాడి చేసిన ఘటన మరవకముందే బాసర-లక్సెట్టిపేట రహదారి సమీపంలో భారీ ఎత్తున టేకు చెట్లను నరికివేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ అధికారులపై దాడి చేసిన తర్వాత అడవులపై అధికార యంత్రాంగం మరింత నిఘా పెంచింది. ఈ పరిస్థితుల్లో టేకు చెట్లను నరకడం ఎలా సాధ్యమైందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

యథేచ్ఛగా నరికివేత…

ఖానాపూర్ అటవీ రేంజ్ పరిధిలో ఉన్న ఎగ్బాల్ పూర్ బీట్ తోపాటు సమీప బీట్ లోనూ సుమారు వందకు పైగా టేకు చెట్లు నరికివేతకు గురయ్యాయి. ఒకపక్క కరోనా కారణంగా గ్రామాల్లో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావడంలేదు. అదేవిధంగా అధికార యంత్రాంగం కరోనాను కట్టడి చేసే పనిలో నిమగ్నమై ఉన్నది. ఈ సమయంలో కలప స్మగ్లర్లు రెచ్చిపోయారు. ఇదే అదునుగా భావించిన స్మగ్లర్లు అడవిలో చొరబడి విలువైన టేకు చెట్లను నరికి వేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం అటవీశాఖ యంత్రాంగాన్ని కుదిపేస్తోన్నది.

ఆలస్యంగా వెలుగులోకి..

కాగా ఎగ్బాల్ పూర్ పరిధిలో పెద్ద మొత్తంలో టేకు చెట్ల నరికివేత ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ చెట్లను నాలుగైదు రోజుల క్రితమే నరికినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియకుండా ఇక్కడి అధికారులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

tags: Adilabad, Forest, Tree, Cutting, Smugglers, Officers and Officers

Next Story

Most Viewed