మినరల్ వాటర్ కంటే మిషన్ భగీరథ నీళ్లే బెటర్ !

by  |
మినరల్ వాటర్ కంటే మిషన్ భగీరథ నీళ్లే బెటర్ !
X

దిశ, తెలంగాణ బ్యూరో: మార్కెట్‌లో దొరికే మినరల్‌ వాటర్‌కంటే మిషన్‌ భగీరథ నీరే సురక్షితమని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ఆధునిక టెక్నాలజీతో మిషన్‌ భగీరథలో నీటి శుద్ధి జరుగుతోందని తెలిపారు. మిషన్​ భగీరథ ఈఎన్‌సీ కార్యాలయంలో బుధవారం ఇంజనీర్లతో సమీక్షా సమావేశం సందర్భంగా అన్నిజిల్లాల ఎస్‌ఈల నుంచి నివేదికలు తీసుకుని, గ్రామాల్లో జరుగుతున్న స్థిరీకరణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్‌ నాటికి అన్ని జిల్లాల పరిధిలోని గ్రామాల్లో స్థిరీకరణ పనులు పూర్తిచేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరు సరఫరా కావాలని, ఇప్పటికే ఆదిలాబాద్‌ నుంచి ఆమ్రాబాద్‌ వరకు ఉన్న ఆదివాసీ గూడాలు, లంబాడా తండాలకు మిషన్‌ భగీరథతో రక్షిత మంచినీరు అందుతోందన్నారు. ఇక మిగిలిన 126ఐసొలేట్‌ (అటవీ, గుట్టల ప్రాంతాల్లో) ఆవాసాల్లో జరుగుతున్న నీటి సరఫరా పనులను మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు.

Next Story