స్మెల్ థెరపీ బాట పడుతున్న కొవిడ్ పేషెంట్లు

by  |
స్మెల్ థెరపీ బాట పడుతున్న కొవిడ్ పేషెంట్లు
X

కొవిడ్-19 సోకగానే వెంటనే కనిపించే లక్షణంగా వాసన జ్ఞానం కోల్పోవడాన్ని వర్గీకరించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కూడా ఈ లక్షణాన్ని అధికారిక లక్షణాల్లో ఒకటిగా చేర్చింది. తీవ్రంగా ప్రభావితమై ఆస్పత్రుల్లో చేరిన వారితో పాటు తక్కువ లక్షణాలు కనిపించి ఇళ్లలోనే క్వారంటైన్ అయిన పేషెంట్లలో కూడా ఈ లక్షణం ప్రధానంగా కనిపించింది. అయితే చాలా మంది పేషెంట్లలో కొవిడ్-19 నుంచి బయటపడినప్పటికీ ఈ లక్షణం తిరిగిరావడం లేదట. దీంతో తమకు వైరస్ పూర్తిగా తగ్గిందని డాక్టర్లు చెబుతున్నప్పటికీ పేషెంట్లు నమ్మకపోగా.. అనవసర ఆందోళనలకు, మానసిక భయాలకు లోనవుతున్నారట. ముఖ్యంగా అమెరికావ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి చాలా ఆస్పత్రుల్లో కనిపిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేయడానికి చారిటీ సంస్థలు ముందుకొచ్చాయి.

అందుకు ‘స్మెల్ థెరపీ’ అని ఒక చికిత్సను అమలు చేస్తున్నారు. ఇది దాదాపుగా ముక్కుకు ఫిజియోథెరపీ చేయడం లాంటి చికిత్స అని ఆబ్సెంట్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు క్రిస్సీ కెల్లీ చెబుతున్నారు. ఇందులో మొదటగా ముక్కుకు గాఢంగా వాసన వచ్చే నూనెలతో మసాజ్ చేస్తారు. తర్వాత బాగా వాసన వచ్చే రోజ్ వాటర్ లాంటి ద్రవాలతో మర్ధన చేస్తారు. చివరగా పువ్వులు, కాయలు, పర్‌ఫ్యూమ్‌లు వాసన చూపించి, ముక్కులో ఉన్న వాసన గ్రంథులను ఉత్తేజితం చేస్తారు. అయితే దీన్ని చికిత్సగా పరిగణించవద్దని, కొంతమందిలో తాము భయంకరమైన వ్యాధి నుంచి బయటపడతామో లేదోనన్న భయంతో కొన్నిసార్లు వాసన వచ్చినా కూడా తెలుసుకోలేకపోతారని, దీన్ని కేవలం ఒక విరుగుడులా మాత్రమే పరిగణించాలని క్రిస్సీ కెల్లీ వివరించారు. ఇప్పటికే 7000 మందికి పైగా తమ వద్ద స్మెల్ థెరపీ చేయించుకున్నారని కెల్లీ చెప్పారు.

Next Story