లాక్‌డౌన్ ఎఫెక్ట్ మొబైల్ బిజినెస్ కొలాప్స్

by  |
లాక్‌డౌన్ ఎఫెక్ట్ మొబైల్ బిజినెస్ కొలాప్స్
X

కరోనా వైరస్‌ వ్యాపారుల పాలిట శాపంగా మారింది. పారిశ్రామిక విప్లవంలో గత పదేళ్లలో స్మార్ట్ ఫోన్ విప్లవం ప్రపంచం గతిని మార్చేసింది. స్మార్ట్ ఫోన్‌కు జనరేషన్ (జీ) నెట్ వర్క్‌లు విస్తృతమైన ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్‌గా మార్చేసి, ఆధునిక ప్రపంచపు దశదిశలను పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచంలో ఏమూల ఏం జరుగుతుందో తెలుసుకోవడం సులభమైపోయింది. అందుకే అరచేతిలో ప్రపంచం అని స్మార్ట్ ఫోన్‌ను ఉద్దేశించే అన్నారు. అయితే కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్ని ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్తోంది.

లాక్‌డౌన్ రెండు నెలలు కొనసాగితే మొబైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. ఎందుకంటే దేశంలోని 4 కోట్ల మంది చేతుల్లో మొబైల్ ఫోన్లు మాయం కానున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు. ఇండియన్ సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసియా) వెల్లడించిన వివరాల ప్రకారం… స్మార్ట్ ఫోన్ పరిశ్రమ ప్రధాన కేంద్రం చైనా, కొరియాలు. సరసమైన ధరకు ఎక్కువ ఫీచర్లుగల ఫోన్లను ఆవిష్కరించడంలో చైనా కంపెనీలు గుత్తాధిపత్యం కొనసాగిస్తున్నాయి. వీటిని ఢీ కొట్టగల కంపెనీ ఏదీ రాలేదు. సమీపభవిష్యత్‌లో వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. భారత్‌లో స్టార్టప్ కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేసినా.. చైనా కంపెనీల ముందు తలవంచకతప్పడం లేదు. ఈ క్రమంలో చైనాలో కరోనా ప్రారంభమైన నాటి నుంచి స్మార్ట్ ఫోన్లు, వాటి విడిభాగాలపై నియంత్రణ కొనసాగుతోంది.

లాక్‌డౌన్ నేపథ్యంలో మొబైల్ ఫోన్ల విడిభాగాలు భారతీయ అవసరలు తీర్చేస్థాయిలో లేవు. దీంతో వివిధ కారణాలతో రిపేర్‌కు వచ్చిన ఫోన్లు మూలపడ్డాయి. కొత్త ఫోన్ల తయారీకి అవసరమైన స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో లేవు. దీనికి తోడు కొత్త హ్యాండ్‌సెట్ల తయారీ, విక్రయాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగితే భారీ సంఖ్యలో అంటే ఇంచుమించు 2.5 కోట్ల మంది ఫోన్లు నిరుపయోగంగా మారతాయని ఐసియా అంచనా వేసింది. అప్‌గ్రేడింగ్ సందర్భంగా వచ్చే సమస్యలు, ఇతరత్రా కారణాలతో హ్యాండ్‌సెట్లలో తలెత్తే లోపాలు, బ్రేక్‌డౌన్ల వల్ల మరిన్ని హ్యాండ్‌సెట్స్ నిరుపయోగంగా మారే అవకాశం ఉందని భావిస్తోంది. ఇదే జరిగితే మొబైల్ పరిశ్రమకు తీరని నష్టం జరుగుతుందని చెబుతోంది.

ప్రస్తుతానికి దేశంలో 85 కోట్ల మొబైల్ ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. వాటికి తోడు నెలకు సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన మొబైళ్ల క్రయవిక్రయాలు జరుగుతాయి. ఇవి గత నెల రోజులుగా నిలిచిపోయాయి. మరో నెల రోజుల పాటు నిలిచిపోతే స్మార్ట్ ఫోన్ పరిశ్రమపై ఇది మరింత తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా మొబైల్ పరిశ్రమలోని ఉద్యోగాలతో పాటు టెలికాం రంగంలోని ఉద్యోగాలపై ఇది ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఐసియా అంచనావేస్తోంది. అందుకే మొబైల్ ఫోన్లను నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చడం ద్వారా షాపుల ఓపెనింగ్‌కు అవకాశం ఇవ్వాలని, తద్వారా మొబైల్ పరిశ్రమను కాపాడాలని ఐసియా కోరుతోంది.

Tags: mobile industry, smartphone industry, icea, mobile phone, spare parts, china

Next Story

Most Viewed