ఎస్ఎల్‌జి ఆస్పత్రి సేవ‌లు అభినంద‌నీయం

by  |
ఎస్ఎల్‌జి ఆస్పత్రి సేవ‌లు అభినంద‌నీయం
X

దిశ ప్రతినిధి, హైద‌రాబాద్ : మహిళల ఆరోగ్య భ‌ద్రత‌కు ఎస్ఎల్‌జీ ఆస్పత్రి యాజ‌మాన్యం చేస్తున్న సేవ‌లు, చూపిస్తున్న చొర‌వ ఎంతో ప్రశంస‌నీయ‌మ‌ని నిజాంపేట్ మేయ‌ర్ కొల‌ను నీలా గోపాల్‌రెడ్డి అన్నారు. ప్రపంచ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా ఈరోజు ఎస్ఎల్‌జి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన “స‌ఖి“కార్యక్రమాన్ని ఆస్పత్రుల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దండు శివ‌రామ‌రాజు, ఎస్‌ఎల్‌జి ఆస్పత్రుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీవీఎస్ సోమ‌రాజుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేయర్ నీలా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌ల ఆరోగ్య భ‌ద్రత‌కు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఫొటో సెష‌న్‌ను.. ఆమె ప్రారంభించి సెష‌న్‌ను తిల‌కించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌మావేశంలో మేయ‌ర్ మాట్లాడుతూ.. ఇటీవ‌ల కాలంలో దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు అవ‌గాహ‌న లోపంతో క్యాన్సర్ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నార‌ని అన్నారు. అందుకే మ‌హిళ‌ల‌కు ఎటువంటి ఆరోగ్య స‌మ‌స్యలు త‌లెత్తినా వెంట‌నే ప‌రీక్షించుకునేందుకు ఎస్ఎల్‌జీ ఆస్పత్రి ఏర్పాటు చేసిన‌“స‌ఖి“ఒక అద్భుత‌మైన కార్యక్రమం అన్నారు. ఆర్ధికంగా వెనుక‌బ‌డి, స‌కాలంలో వైద్యప‌రీక్షలు చేయించుకోలోని స్థితిలో ఉన్న నిజాంపేట స‌మీప ప్రాంతాల మ‌హిళ‌లకు“స‌ఖి“కార్యక్రమం ఒక వ‌రం లాంటిది అని మేయ‌ర్ పేర్కొన్నారు.

మ‌హిళల ఆరోగ్య భ‌ద్రత‌కు, వారి శ్రేయ‌స్సుకు ఎస్ఎల్‌జి ఆస్పత్రి యాజ‌మాన్యం చేస్తున్న సేవ‌లు ఎన‌లేనివ‌ని ప్రశంసించారు. జంట నగరాల ప్రజ‌లు ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చని ఆమె ఈ సంద‌ర్భంగా తెలిపారు. మ‌హిళ‌ల్లో బ్రెస్ట్ క్యాన్సర్, స‌ర్వైక‌ల్ క్యాన్సర్లు ఎంతో ప్రమాద‌క‌ర‌మైన‌వ‌ని తెలిపారు. మహిళల్లో్ ఏ చిన్న ల‌క్షణం క‌నిపించినా వెంట‌నే ప‌రీక్షలు చేయించుకుని చికిత్స పొందాల‌ని సూచించారు. డాక్టర్లు , వైద్యసిబ్బందికి మేయర్ మ‌హిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి మెడిక‌ల్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ పాణిగ్రహి, అంకాల‌జిస్ట్ డాక్టర్ సురేంద్ర బ‌త్తుల‌‌, డాక్టర్ స్వర్ణలత‌, డాక్టర్ సువ‌ర్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.



Next Story