ఎట్టి పరిస్థితుల్లో అలా కానివ్వం

by  |
ఎట్టి పరిస్థితుల్లో అలా కానివ్వం
X

దిశ ప్రతినిధి, ఖ‌మ్మం: బొగ్గు గనుల ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. దేశంలో ఉన్న 500 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్‌ 18 నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలుత 42 బ్లాకులకు ఈ- యాక్షన్​ప్రారంభించి వేలం ప్రక్రియను సైతం నిర్వహించింది. కేంద్రం నిర్ణయంతో అటు కోల్‌ ఇండియా, ఇటు సింగరేణికి భవిష్యత్‌లో భారీ నష్టం కలిగే అవకాశం ఉంద‌ని కార్మిక సంఘాల నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పటివరకు కోల్‌ఇండియా, సింగరేణి మాత్రమే బొగ్గు బ్లాకులు దక్కించుకునేవి. ఇప్పుడు మోడీ సర్కార్​ప్రైవేటు సంస్థలు సైతం బొగ్గు బ్లాకులను ద‌క్కించుకునేందుకు వీలు క‌ల్పించింది. ఇందులో రాష్ట్రంలోని భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 9 కొత్త బ్లాకులు సైతం ఉన్నాయి.

72 గంట‌ల స‌మ్మెకు శ్రీకారం..

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల‌ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఆందోళ‌న బాట పట్టాయి. క్రమంగా ఆందోళ‌న‌ల‌ను ఉధృతం చేయాల‌ని నిర్ణయించాయి. ఈమేరకు గురువారం బొగ్గు గ‌ని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 72 గంటల సమ్మె ప్రారంభమైంది. ఇందులో ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ, హెచ్ఎమ్మెస్, సీఐటీయూ, బిఎమ్మెస్, టీబీజీకేఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మాత్రం కేవ‌లం ఒక రోజు స‌మ్మెకు మాత్రమే ప‌రిమితమ‌వుతున్నట్లు స్పష్టం చేసింది. కార్మికులు ఆర్థికంగా న‌ష్టపోవ‌ద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంఘం నాయ‌కులు తెలిపారు. అయితే టీబీజీకేఎస్​తీరును మిగ‌తా సంఘాలు త‌ప్పుబ‌డుతున్నాయి.

కార్మిక కుటుంబాల్లో ఆందోళ‌న‌..

బొగ్గు బ్లాకుల ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్ర ప్రభుత్వం చ‌క‌చ‌కా పావులు క‌దుపుతుంటే కార్మిక వ‌ర్గాలు, వారి కుటుంబాల్లో ఆందోళ‌న వ్యక్తమ‌వుతున్నది. ప్రైవేటీక‌ర‌ణ‌తో ఇప్పటి వ‌ర‌కు అందుతున్న అనేక సౌక‌ర్యాలు కోల్పోవాల్సి వ‌స్తుంద‌ని భ‌యప‌డుతున్నారు. కార్మిక హక్కులు హరించుకుపోతాయ‌ని, వెట్టిచాకిరి చేయాల్సి వస్తుంద‌ని ఆందోళన పడుతున్నారు.


Next Story

Most Viewed