రేపు భూపాలపల్లి పట్టణం బంద్

by  |
Singareni-1
X

దిశ, భూపాలపల్లి: సింగరేణిలో బొగ్గు బావుల ప్రైవేటీకరణ నిరసిస్తూ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72 గంటలపాటు సమ్మె రెండోరోజు విజయవంతంగా కొనసాగుతుంది. 5600 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఏ ఒక్కరూ విధులకు హాజరు కాలేదు. దీంతో బొగ్గు బావులు నిర్మానుష్యంగా ఉన్నాయి. బొగ్గును రవాణా చేసే లారీలు రోడ్డు పక్కన నిలిచిపోయాయి. బావుల నుండి బొగ్గును తీసే వాహనాలు ఎక్కడికక్కడా నిలిచే ఉన్నాయి. మొదటిరోజు నిర్వహించిన ధర్నా, రాస్తారోకోలో కార్మిక సంఘాలు పాల్గొనగా రెండో రోజు ప్రశాంతంగా సమ్మె కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు నిరసనగా కార్మికులు చేస్తున్న సమ్మెకు వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. టీఆర్ఎస్ కు సంబంధించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐఎన్ టీయూసీ సంఘం, వివిధ కార్మిక సంఘాల నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. భూపాలపల్లి పరిధిలోని నాలుగు బొగ్గు గనులు, రెండు ఓపెన్ కాస్ట్ లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు రోజుల్లో 42 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడగా సంస్థకు రూ. 110 కోట్ల నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 4 బ్లాగులను ప్రైవేటీకరణను విరమించుకోవాలని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి.

శనివారం భూపాలపల్లి పట్టణం బంద్

శనివారం సింగరేణి కార్మికులకు మద్దతుగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని వ్యాపార సంస్థలు బంద్ పాటించనున్నాయని ఏఐటీసీసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్ తెలిపారు. కార్మికులు తలపెట్టిన సమ్మెకు వ్యాపార, వాణిజ్య సంఘాలు మద్దతు తెలపాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Next Story

Most Viewed