సింగరేణిలో సమ్మె సైరన్..? సీఎం అపాయింట్ మెంట్ ఇప్పించకపోతే..!

by  |
సింగరేణిలో సమ్మె సైరన్..? సీఎం అపాయింట్ మెంట్ ఇప్పించకపోతే..!
X

దిశ, తాండూర్ : హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో సోమవారం సింగరేణి యాజమాన్యంతో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై, కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఆర్‌ఎల్‌సీ అధికారులతో, సింగరేణి అధికారులతో జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆర్‌ఎల్‌సీ మధ్యవర్తిత్వం వహించి సింగరేణి యాజమాన్యం ద్వారా ఈ నెల 8 తేదీలోపు సీఎం చంద్రశేఖర్ రావుతో అపాయింట్ మెంట్ ఇప్పించాలన్నారు.

సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని, ఇతర 12 డిమాండ్ల పై చర్చించడానికి చొరవ చూపాలని ఆర్‌ఎల్‌సీకి, సింగరేణి యాజమాన్యానికి జేఏసీ నేతలు సూచించారు. సీఎం వెంటనే స్పందించి సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే దక్కేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపించాలన్నారు. సీఎంతో ఆపాయింట్ మెంట్ ఇప్పించని పక్షంలో సింగరేణిని ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడానికి ఈనెల 9, 10, 11 తేదీల్లో సమ్మె చేయక తప్పదన్నారు. కార్మికులు సమ్మె చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ చర్చలో జేఏసీ సంఘాలు ఏఐటీయూసీ, ఐఏన్టీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, టీబీజీకేఎస్ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, నరసింహారావు, రియాజ్ అహ్మద్, మిరియాల రాజిరెడ్డి, సత్తయ్య, టి.రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed