ముల్కనూర్ బస్టాండ్‌కు కొత్త రూపు

by Nallavelli.Anjaneyulu |

భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ బస్టాండ్‌కు త్వరలో కొత్త రూపు రానుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి బస్టాండ్‌ను సందర్శించి అభివృద్ధి అవకాశాలను పరిశీలించారు.

ముల్కనూర్ బస్టాండ్‌కు కొత్త రూపు
X

దిశ‌, భీమదేవరపల్లి : భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ బస్టాండ్‌కు త్వరలో కొత్త రూపు రానుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి బస్టాండ్‌ను సందర్శించి అభివృద్ధి అవకాశాలను పరిశీలించారు. బస్టాండ్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రయాణికుల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముల్కనూర్ గ్రామం విద్య, వ్యవసాయం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉండటంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్టాండ్‌ను వినియోగిస్తున్నారు. గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది ప్రధాన రవాణా కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో బస్టాండ్ ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ ఐదు నుంచి ఆరు వేల వరకు జనాభా ఉన్న ముల్కనూర్ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. బస్టాండ్ ప్రాంగణం ముందు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడతామని చెప్పారు.

ప్రయాణికులకు తాగునీరు, పారిశుధ్యం, నిరీక్షణ షెడ్లు, ఇతర సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్టీసీ సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎండీ పర్యటనతో ముల్కనూర్ బస్టాండ్ అభివృద్ధిపై ఆశలు పెరిగాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రతిపాదనలు అమల్లోకి వస్తే బస్టాండ్‌కు మరింత ఆదాయం సమకూరడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో ముల్కనూరు గ్రామ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అశోక్ ముఖర్జీ, గనవేన కొంరయ్య, ఊస కోయిల ప్రకాష్, వార్డు సభ్యులు అశోక్ యాదవ్, చిట్కూరి అనిల్, ముల్కనూరు ఎస్సై ఎం రాజు, ఆర్టీసీ సంబంధించిన అధికారులు తదితరులు ఉన్నారు.

Next Story